నవతెలంగాణ – తాడ్వాయి
మేడారం మహా జాతరకు కోటి యాభై లక్షల పైచిలుక వచ్చే సందర్శకుల వైద్య సదుపాయాల నిమిత్తం శనివారం మేడారం గిరిజన మ్యూజియం లో బైక్ అంబులెన్స్ లను మంత్రి డాక్టర్ సీతక్క, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా, హెల్త్ కమిషనర్ ఆర్ వి కర్ణన్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ప్రత్యేక అధికారులు ఎస్. కృష్ణ ఆదిత్య, రాధిక గుప్త, ప్రతిమ సింగ్ లతో కలిసి స్థానిక జిల్లా వైద్యాధికారి అల్లం ముప్పయ్య ఆధ్వర్యంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారం జాతర లో భక్తుల రద్దీ పెరుగుతుందని, ఆపద సమయంలో భక్తులకు సేవలు అందిచనికి నూతనంగా బైక్ అంబులెన్స్ లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. జాతరలో 40 బైక్ అంబులెన్స్ లు ఏర్పాటు చేశాం అని ఇందులో 21 రకాల వస్తువుల కిట్ ద్వారా భక్తులు వైద్యం అందించడం జరుగుతుంది అని తెలిపారు. ముఖ్యంగా రద్దీ ఉండే ప్రాంతాలలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జాతరకు వచ్చే భక్తులు ఇబ్బందులూ పడకుండా సమన్వయం తో దేవతల దర్శనం చేసుకోవాలని ఆపద సమయంలో సేవలు అందించే అంబులెన్స్ కి దారి ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజ, జిల్లా వైద్య అధికారి ఆలెం అప్పయ్య ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.