సేవాలాల్ చూపిన మార్గంలో నడవాలి: ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి

– సంస్కృతి సంప్రదాయాల,నృత్యాలతో అలరించిన గిరిజనలు
–  గిరిజన గ్రామ పంచాయతీలన్నీ ఏకగ్రీవం కావాలి
–  కాంగ్రెస్ హయాంలోనే గిరిజనుల అభివృద్ధి
–  ఘనంగా 285 వ సేవాలాల్ జయంతి ఉత్సవాలు
–  అధిక సంఖ్యలో పాల్గొన్న గిరిజనులు
నవతెలంగాణ – నాగార్జునసాగర్
సంత్ సేవాలాల్ చూపిన మార్గంలోనే గిరిజనులు నడవాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి అన్నారు.ఆదివారం నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ లోని సంత్ సేవాలాల్ ప్రాగణంలో సంత్ సేవాలాల్ జ‌యంతి వేడుక‌ల‌ను అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండువగా గిరిజన ప్రజల సంసృతి సంప్రదాయాలు, నృత్యాలతో నిర్వహించారు. అనంతరం గిరిజన పూజారులచే అత్యంత భక్తి శ్రద్ధలతో విశిష్టంగా నిర్వహించే భోగ్ భండార్ నిర్వహించారు.అనంతరం ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని కాకుండా దేశం మొత్తం కాలినడకన తిరిగి గిరిజనులకు చైతన్య వంతులను చేసిన ఘనత సేవాలాల్ అని అన్నారు. గిరిజన జాతికి మేలు చేసింది ఎవరైనా ఉన్నారంటే సేవాలాల్ మహరాజ్ తరువాత రిజర్వేషన్ తో పాటు ఉన్నత విద్యాబ్యాసానికి, ఉద్యోగాలు పొందటానికి ఇందిరా గాంధీ ఎంతో తోడ్పాటును అందించారని అన్నారు.ఇందిరా గాంధీని స్ఫూర్తిగా తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజనులు అడగగానే కోటి రూపాయలు అందించారని అన్నారు.ప్రతి సంవత్సరం ఇలాగే సంత్ సేవాలాల్ జయంతిని ఇదే స్ఫూర్తితో జరుపుకోవాలని అన్నారు. మహ్మద్ ఘోరీ మన దేశం పై దాడి చేసి, మన తల్లుల, చెల్లెల చెరపట్టి, దేవాలయాలు ధ్వంసం చేసినప్పుడు, గోవులను వధించి, బలవంతంగా మతమార్పిడి జరుపుతున్నప్పుడు, ఘోరీ ని ఎదిరించి17 సార్లు ఓడించిన సాహస వీరుడు పృథ్వీరాజ్ చౌహన్ వంశానికి చెందిన వారు బంజారాలు ( లంబాడి ) అని అన్నారు. మొఘలుల రాక్షసత్వానికి బలైన కొందరైతే, మరికొందరు చెట్టు గుట్టల్లో చెల్లా చెదురై, తమ సంస్కృతి ని కాపాడుకున్న వారు బంజారాలు అని పేర్కొన్నారు. బంజారా వంశంలో మళ్ళీ ధైర్యం, సాహసం కలిగించి, ఆధ్యాత్మిక కిరణాలు ప్రసరింప చేయడానికి జన్మించిన మహనీయుడు సంత్ సేవాలాల్ అని అన్నారు. 1739లో రాయలు ఏలిన రాయల సీమలో గుత్తి లో అవతరించిన వర ప్రసాదం సేవాలాల్ అని కొనియాడారు. సప్త మాతృకలైన తుల్జా భవాని, మంత్రాల భవాని, సీతలా భవాని, హింగలా మాత, కంకాళి భవాని దోలాంగల్ భవాని, దండి భవాని, మేరా మా ఆశీస్సులతో దివ్య తేజమై వెలిగిన శక్తి పుంజం సంత్ సేవాలాల్ అని తెలిపారు. ఏక్ జాత్, ఏక్ వాత్, ఏక్ సాత్ అనే ఆలోచన తో ప్రజలను కలిపిన సంఘటనా శీలి సేవాలాల్ అని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి సాధించాలని, పూర్వీజులు అందించిన విలువలు, సంప్రదాయం మరిచిపోవద్దని చాటిన మహాత్ముడు సేవాలాల్ అని తెలిపారు. తండ్రి రామావత్ భీమ్ నాయక్, తల్లి ధర్మణి యాదిలకు జన్మించి, ఆది పరాశక్తి అంశగా జాతి జనులను జాగృతం చేయవచ్చిన కారణ జన్ముడని కొనియాడారు. 12 ఏళ్ల వయస్సు లో భృగరాజు గురువు సమక్షంలో దీక్ష పొంది, చాంద్రాయణ గుట్ట వద్ద నున్న కాలోకుండ సరస్సు లో స్నానం ఆచరించి, చెన్న కేశవ స్వామి దర్శనం చేసుకుని, పార్వతి దేవీ సమక్షంలో ధ్యాన నిమగ్నుడయ్యాడ‌ని తెలిపారు. జంతుబలులను నిరసించి, అమ్మవారికి పొంగలిని నైవేద్యం పెట్టి, భక్తి సాగరంలో మునిగాడ‌ని తెలిపారు.తినడానికి తిండి లేకున్నా ధర్మాన్ని వదలక, సబ్లీ పూజ, హోలీ సంప్రదాయ పండుగలతో ప్రజల్లో ధార్మిక భావన పెంచిన గొప్ప వాడ‌ని తెలిపారు. రాయచూరు మీదుగా హైదరాబాద్ చేరుకున్నప్పుడు,నిజాం నవాబు ఆహారం లో విషం పెట్టి, సేవాలాల్ చంపాలని ప్రయత్నం చేస్తే, తన మహిమ తో విషాన్ని పోగొట్టి, అమృత ఆహారంగా మార్చి, నిజాం నుండి గోవులను రక్షించిన మహిమాన్వితుడ‌న్నారు. తిరుపతిలో హతీరామ్ బాబా భక్తిని కొనియాడి, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని,భక్తి మార్గం లో నడవాలని ప్రజలకు బోధించాడ‌ని తెలిపారు. ఆధ్యాత్మిక చైతన్యం, విద్య ను ఆర్జించి, నాగరికత తో జీవించటం, ఇతర మతాల్లోకి చేరకుండా, తన ధర్మాన్ని కాపాడుకోవటం అనే సూత్రాలతో ఉద్యమించిన సంత్ సేవాలాల్ మహారాష్ట్రలో సమాధి పొంది, సేవా నిరతి ని, ఆధ్యాత్మిక చింతనను, భగవత్ తత్వాన్ని పంచిన సంత్ సేవాలాల్ అందరికి మార్గదర్శకుడ‌ని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం సంత్‌ సేవాలాల్‌ చూపించిన మార్గం ఆదర్శనీయమన్నారు. ఆయన బోధనలను అందరూ ఆచరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బంజారా సేవా సంఘం సీనియర్ నాయకులు రమావత్ శంకర్ నాయక్,ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ రాంచందర్ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాబురావు నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు భగవాన్ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రవి నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నియోజకవర్గ అధ్యక్షులు భాస్కర్ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రవి నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నియోజకవర్గ కోశాధికారి సకృ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నియోజకవర్గ మాజీ అధ్యక్షులు భిక్షా నాయక్, ఆల్ ఇండియా బజార సేవా సంఘం సాగర్ పట్టణ అధ్యక్షులు మోహన్ నాయక్, కౌన్సిలర్ మంగత నాయక్, ఎమ్మార్వోలు ఎంపీడీవోలు, ఎంపీపీలు, జడ్పిటిసిలు, గిరిజన నాయకులు గిరిజన మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love