నవతెలంగాణ-హైదరాబాద్: ఈ ఏడాది మే 3న నిర్వహించిన నీట్-యూడీ పరీక్ష రద్దు అయిన విషయం తెలిసిందే. రాజస్థాన్లో పేపర్ లీక్ కారణంగా సదురు ఎగ్జామ్ను రద్దు చేస్టున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. దీంతో మనస్థాపం చెందిన పలువురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈక్రమంలో తాజాగా ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ బాధిత కుటుంబాలను పరామర్శించారు.గురువారం ఢిల్లీలోని సూసైడ్ చేసుకున్న ప్రదీప్ మేఘ్వాల్ కుటుంబసభ్యులను కలిశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించారు. విద్యార్థి మృతికి ప్రధాని మోడీ, అమిత్ షా బాధ్యత వహించాలని, ఆ విద్యార్ధిది ఆత్మహత్య కాదని అవినీతి కారణంగా ప్రదీప్ మరణించాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కుమారుని మరణం ఆ కుటుంబానికి తీరని లోటు, మేఘ్వాల్ మరణానికి “విచ్ఛిన్నమైన, అవినీతిమయమైన వ్యవస్థే” కారణమని గాంధీ పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణ బాధ్యతలను “మాఫియా” చేతుల్లోకి అప్పగించారని, ఈ దుర్ఘటనకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
“ఈ రోజు, నేను మేధావి విద్యార్థి ప్రదీప్ మేఘ్వాల్ కుటుంబాన్ని కలిశాను, NEET పేపర్ లీక్ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రదీప్, తన ప్రాణాలను తానే బలి తీసుకున్నాడు. వారి బాధను మాటల్లో వర్ణించడం అసాధ్యం. ఒక తల్లిదండ్రులు తమ కుమారుడిని కోల్పోయారు, అసలు వారి తప్పేమీ లేదు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు చదువు, పోటీ, తమ భవిష్యత్తుకు సంబంధించిన ఒత్తిడిలో జీవిస్తున్నారు. ఇలాంటి సమయంలో పేపర్ లీక్ జరిగినప్పుడు, కేవలం ఒక పరీక్ష మాత్రమే విచ్ఛిన్నం కాదు—ఒక విద్యార్థి కల, ఒక కుటుంబం మొత్తం ముక్కలైపోతుంది. ప్రదీప్ మరణం ఆత్మహత్య కాదు—అది ఒక విచ్ఛిన్నమైన, అవినీతిమయమైన వ్యవస్థ ఫలితం. పరీక్షల నిర్వహణ వ్యవస్థను మాఫియా చేతుల్లోకి అప్పగించిన వారు, నేటికీ తమ పదవులకు అతుక్కుపోయి కూర్చున్న వారు (మోడీ-షా) ఈ కుటుంబానికి జవాబుదారీగా ఉండాలి’ అని రాసుకొచ్చారు



