హస్తం-పేదల నేస్తం.. ములుగు ఎమ్మెల్యే సీతక్క

– కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫి.

– క్వింటాకు 500 రూపాయల బోనస్..
– రైతులకు ఏడాదికి 15000/-, రైతు కూలీలకు 12000/- రూపాయలు.
– మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, ప్రతి నెల మహిళకు 2500/- రూపాయల ఆర్థిక సహాయం,
– 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
– వృద్దులకు, వితంతువులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, గీతా కార్మికులు అందరికీ 4000/- చేయూత పెన్షన్.
– కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.
నవతెలంగాణ-ములుగు: హస్తం నిరుపేదల నేస్తం అని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మంగళవారం మండలంలోని ఫ్రూట్ ఫారం సోమల గడ్డ బొల్లెపల్లి రాఘవపట్నం పసర గ్రామాల్లో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పాలడుగు వెంకట కృష్ణ ఆధ్వర్యంలో జోరుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ నేను మీ ఇంటి ఆడబిడ్డను, మీ కష్టాల్లో, సుఖాల్లో వచ్చే మీ ఆత్మీయ బంధువును, నేను ఓట్ల కోసం వచ్చే నాయకురాలిని కాదు అని సీతక్క అన్నారు.ప్రతి గ్రామంలో పూలమాలతో, నృత్యాలతో, డప్పు చప్పుళ్లతో, కేరింతలతో, సీతక్క ఘన స్వాగతం పలికారు.అలాగే రాఘవపట్నం గ్రామం నుండి 50 మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరగా ఎమ్మెల్యే సీతక్క కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయాన్ని పండుగ చేస్తాం అని క్వింటకు 500/- చొప్పున బోనస్ అందిస్తామని, ఎకరాకు ఏడాదికి రైతుకు 15000/- , రైతు కూలీకి 12000/- రూపాయలు అందించి ఆదుకుంటామని అన్నారు. లక్ష కోట్లతో దేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్ట్ కట్టినం అని గొప్పలు చెప్పుకున్న కెసిఆర్ గారు నాణ్యత ప్రమాణాలు లోపించి మూడేళ్లకే కాళేశ్వరం ప్రాజెక్ట్ బీటలు వారడం కల్వకుంట్ల వారి అవినీతికి ప్రతీక అని అన్నారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి మన తలాపున ఉన్న గోదావరి నీళ్లను తరలించడానికి కట్టిన ప్రాజెక్ట్ కూడా నాణ్యతతో కట్టకుండా లక్ష కోట్ల రూపాయలు దోచుకుపోయారని అన్నారు. మన బ్రతుకులు మారుతాయి అని, మన కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ ఇస్తే మన రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుని మనల్ని మోసం చేసిందని అన్నారు. ఇకనైనా మోస పూరిత వాగ్ధానాలు చేసే నాయకుల్ని నమ్మవద్దని, ఈ దేశ స్వాతంత్య్రం కోసం పుట్టిన కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ స్వరాష్ట్ర కలను తీర్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అన్నారు. ఆరు గ్యారంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేస్తామని హామీలు ఇచ్చి ప్రతి ఇంటికి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జీలు తేల హరిప్రసాద్ జెట్టీ సోమయ్య రాఘవపట్నం గ్రామ కమిటీ అధ్యక్షుడు కంటైం సూర్యనారాయణ గోవిందరావుపేట మండల జిల్లా నాయకులు, మండల నాయకులు, మండల అనుబంధ సంఘాల నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకురాల్లు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.
Spread the love