తాడిచెర్ల పీఏసీఎస్ ఛైర్మన్ పై అవిశ్వాసం.?

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘము ఛైర్మన్ చెప్యాల రామారావుకు మరోసారి పదవి గండం ఎదురుకానున్నట్లుగా తెలుస్తోంది. పాలకవర్గం సభ్యులు అవిశ్వాసం దిశగా రంగం సిద్ధం చేస్తున్నట్లుగా విశ్వసనీయత సమాచారం. పాలకవర్గంలోని కొంతమంది మంది డైరెక్టర్లు అవిశ్వాసం పెట్టేందుకు ప్రత్యేక ప్రణాళికల తయారు చేసుకొని గురువారం అవిశ్వాస తీర్మానం పత్రాన్ని భూపాలపల్లి డిఎస్ఓ శైలజ కు అందజేశారు. అలాగే కొందరు బీఆర్ఎస్ డైరెక్టర్లు రాష్ట్ర ఐటి,పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును హైదరాబాద్ లో కలుసుకొని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొనున్నట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 15-2020న పీఏసీఎస్ ఎన్నికలు జరుగగా 13మంది డైరెక్టర్లు ఎన్నికయ్యారు. మల్లారం నుంచి రామారావు పోటీ చేసి గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీతో గెలిసిన డైరెక్టర్లు ఎక్కువగా ఉండడంతో అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన రామారావు పదవిని సొంతం చేసుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాలతో పలు ఆరోపణలతో రామారావు చైర్మన్ పదవి నుంచీ నెలల పాటు సస్పెన్షన్ అయ్యారు. అనంతరం కోర్టును ఆశ్రయించి ఇటీవల ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన కొద్దీ రోజుల్లోనే అవిశ్వాసంతో మళ్ళీ చైర్మన్ పదవికి గండం మొదలైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎలాగైనా పీఏసీఎస్ పీఠాన్ని కాంగ్రెస్ నాయకులు తమ ఖాతాలో వేసుకోవడానికి పలుమార్లు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ డైరెక్టర్ల మద్దతుతో రహస్యంగా భేటియై కాంగ్రెస్ డైరెక్టర్లకు బీఆర్ఎస్ డైరెక్టర్లు మద్దతు ఇచ్చేలా ఒకతాటిపైకి తీసికొచ్చినట్లుగా తెలుస్తోంది. పూర్తిస్థాయిలో డైరెక్టర్ల మద్దతు సాధించిన కాంగ్రెస్ నాయకులు అవిశ్వాస ప్రక్రియకు వున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ మద్దతు డైరెక్టర్లు మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తిర్టం పుచ్చుకొనున్నట్లుగా తెలుస్తోంది. పీఏసీఎస్ ఛైర్మన్ పదవీకాలం మరో ఏడాది ఉండగా కాంగ్రెస్ కు చెందిన డైరెక్టర్లలో ఛైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో అనే ఉత్కంఠ కొనసాగుతోంది.
Spread the love