
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి విద్యార్థులకు పౌష్టికాహారం అందించే దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశించారు.పెద్దపల్లి జిల్లాలోని సుల్తాన్ పూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్ ను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, ఎమ్మెల్సీ టి. భాను ప్రసాద్ రావు లతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న సేవలు, అక్కడ అందుబాటులో ఉన్న వసతులు, మధ్యాహ్నం భోజనం, కిచెన్ గార్డెన్ నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులో ఉన్న 8 గుంటల స్థలంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి కూరగాయల మొక్కలు, ఆకు కూరలు పెంచుతూ వాటిని పిల్లలకు పౌష్టికాహారం క్రింద మధ్యాహ్నం భోజనంలో అందించడం మంచి ఆలోచనని, కార్యక్రమాన్ని రూపొందించిన జిల్లా కలెక్టర్ ను, కట్టుదిట్టంగా నిర్వహిస్తున్న సంబంధిత అధికారులను అభినందిస్తున్న ట్లుగా తెలిపారు.జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు సైతం సుల్తాన్పూర్ జడ్పీహెచ్ఎస్ ను ఆదర్శంగా తీసుకొని అందుబాటులో ఉన్న స్థలంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.