![](https://navatelangana.com/wp-content/uploads/2024/05/Untitled-635.jpg)
– ఓటర్ స్లిప్పుల పంపిణీలో నిర్లక్ష్యం
– కార్యాలయాలకే పరితమవుతున్న అధికారులు
– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ అద్యక్షులు : ఎండీ. యాకూబ్ పాషా
నవతెలంగాణ – పాల్వంచ
ఈనెల 27న జరగనున్న పట్టభద్రుల ఎన్నికలలో ఎలా ఓటు వేయాలో, పట్టభద్రులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండి. యాకూబ్ పాషా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరో రెండు రోజులలో ఎన్నిక జరగనున్న నేపథ్యంలో పట్టభద్రులకు అవగాహన కల్పించి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరేలా చేయాల్సిన అధికారులు, వారి నిర్లక్ష్యంతో ఓటింగ్ శాతం తగ్గేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటర్లకు అవగాహన కల్పించాలంటూ ఎన్నికల కమిషన్ నుండి ఆదేశాలు వస్తున్నా, అధికారులు మాత్రం కార్యాలయాలకు పరిమితమ వుతున్నారన్నారు. ఓటర్లకు స్లిప్పుల పంపిణీ కూడా సక్రమంగా జరగడం లేదని, పట్టభద్రులు ఓటు వేయటం ఆషామాషీ వ్యవహారం కాదని, ఈవీఎం మిషన్ కు బదులు బ్యాలెట్ పేపర్లు ఉంటాయని, బ్యాలెట్ పేపర్లో రాయటానికి అధికారి వద్ద ఉన్న పెన్ను మాత్రమే ఉపయోగించాలని, ఆ పెన్నుతో కూడా తమకు నచ్చినట్లు ఓటర్లు వ్రాయడం కుదరదని, మొదటి, రెండవ, మూడవ ప్రాధాన్యతలలో తమకు నచ్చిన అభ్యర్థిని అంకెలతో ఎన్నుకోవాలని, అంకెలు వేసే క్రమంలో కూడా బాక్సు దాటి బయటకు వస్తే ఆ ఓటు చెల్లదని, రోమన్ అంకెలు, టిక్కులు, ఇంగ్లీష్ పదాలు, సున్నాలు లాంటివి వేసిన ఆ ఓటు మురిగి పోతుందని, ఇంత తతంగం ఉన్న పట్టభద్రుల ఓటు వేసే విధానం పట్ల అవగాహన కల్పించడంలో ఎందుకు అధికారులు అలసత్వంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావటం లేదని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఓటర్ అవగాహన కార్యక్రమాలలో భాగంగా కరపత్రాలు, గోడ పత్రికలు, ఫ్లెక్సీలు వంటి వాటితో ఓటర్లకు అవగాహన కల్పించేలా అధికారులను ఆదేశించాలన్నారు.