సీఆర్ పీసీ ద్వారా దుకాణాలు శాశ్వతంగా మూసివేత

– పోలీస్ కమీషనర్ కీలక నిర్ణయం
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో అర్ధరాత్రి వరకు ఎలాంటి సమయపాలన నిర్వహించకుండా అనేక వ్యాపార సాముదాయాలు తెరిచి ఉంటున్నాయి. ఇలా వ్యాపార సాముదాయాలు తెరిచిఉండడం వలన నేరాలు చేసే వ్యక్తులకు అడ్డాలుగా మారుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ వ్యాపార సాముదాయాలు నిలువరించడానికి సెక్షన్ 133 ( 1 ) ( బి ) , ( ఎఫ్ ) ( i ) సి.ఆర్. పి.సి అమలులోకి తీసుకురావడం జరుగుతుంది అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సోమవారం ప్రకటనలో తెలిపారు. రాత్రి 10:30 గంటలలోపు వ్యాపార సాముదాయాలు మూసివేయాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంటు వర్క్ నిర్వహించాలని నిజామాబాద్ పోలీస్ కమీషనర్,  జిల్లాలోని ఎస్.ఐలకు, సి.ఐ లకు, ఎ.సి.పిలకు అదేశాలు జారీచేయడం జరిగింది. ఇందు కోసం గత 1 వారం నుండి జిల్లా పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్ పై ప్రత్యేక దృష్టి సారించింది.దీనిలో భాగంగా ఇప్పటి వరకు నిజామాబాద్ డివిజన్ లో 5 దుకాణాల పై కేసు నమోదు చేయడం జరిగింది. దీనిలో ఇద్దరు దుకాణాల యాజమానులకు 4 రోజులు జైలు శిక్ష పడింది. బోధన్ డివిజన్ లో 2 కేసులు నమోదు చేయడం జరిగింది.ఈ దుకాణాలు రాత్రుల్లో ఎక్కువ సమయం వరకు తెరిచి ఉన్నందువలన యువత ఈ స్థలాలలో గుమ్మిగూడి ఉంటున్నారు. దీని ద్వారా సాధారణ ప్రజలకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.ఇదే కాకుండా వేరే ప్రాంతాలకు చెందిన నేరస్థులు కూడా ఈ సాముదాయాల దగ్గర ఉంటూ నేరాలకు పాల్పడుతున్నారు.కావున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని మరియు నేరాలను కంట్రోల్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది.సెక్షన్ 133 ( 1 ) ( బి ), (ఎఫ్ ) (i) సి.ఆర్.పి.సి లో క్షుణ్ణంగా వివరించండింది.కావున దీనిలో భాగంగా సెక్షన్ 133 సి.ఆర్.పి.సి లో సమయములను ఉల్లంఘిస్తూ పబ్లిక్ న్యూసెన్స్  నేరాలకు అడ్డాలుగా మారుతున్నట్టువంటి దుకాణాలను శాశ్వతంగా మూసివేయడానికి నిజామాబాద్ పోలీస్ కమీషనర్ ఆదేశాలు జారీ చేయబోతున్నారు.
Spread the love