ప్రజల విశ్వాసాన్ని దుర్వినియోగం చేస్తారా?
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరపాలి
ఈ మేరకు కేంద్రం ఆదేశాలు ఇవ్వాలి : రామమందిర
విరాళాల వివాదంపై పినరయి విజయన్ డిమాండ్
ఇది సంఘ్ రాజకీయాల
అసలు స్వరూపాన్ని బయటపెట్టే ఉదాహరణ అని విమర్శ
తిరువనంతపురం : అయోధ్య రామమందిర నిర్మాణానికి భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ప్రధాని మోడీ దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఈ కేసుపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రామమందిర విరాళాల వివాదంపై ఎక్స్ వేదికగా పినరయి విజయన్ స్పందించారు. ‘‘అయోధ్య రామమందిరం కోసం భక్తుల నుంచి సేకరించిన విరాళాల్లో భారీ ఆర్థిక అక్రమాలు జరిగినట్టు వస్తున్న వార్తలు అత్యంత తీవ్రమైనవి. ప్రజల విశ్వాసాన్ని, భావోద్వేగాలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించినవారిపైనే ఇప్పుడు వ్యవస్థీకృత ఆర్థిక మోసం ఆరోపణలు వస్తున్నాయి. రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి నాయకత్వం వహించిన ప్రధాని మోడీ ఈ అంశంపై దేశానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. భక్తుల నుంచి సేకరించిన ప్రతి రూపాయికీ లెక్క చెప్పేలా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే ఫేస్బుక్లో చేసిన మరో పోస్టులోనూ ఈ వివాదంపై పినరయి విజయన్ స్పందించారు. భక్తుల నుంచి సేకరించిన విరాళాల్లో భారీ అక్రమాలు జరిగినట్టు వస్తున్న వార్తలు అత్యంత ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. ‘‘ ట్రస్టీలకు సంఘ్ పరివార్ అగ్ర నాయకత్వంతో సంబంధాలు ఉన్నాయి. అయోధ్యలో జరిగిన ప్రతిష్ఠాపన కార్యక్రమంలో కీలక పాత్ర పోషించిన ప్రధాని ఈ అంశంపై స్పందించాల్సిన బాధ్యత ఉంది. పార్లమెంట్ ఎదుట ఉంచిన కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా ఏర్పడిన ఈ ట్రస్ట్ ఇప్పుడు అనుమానాల ముసుగులోకి వెళ్లింది’’ అని ఆయన విమర్శించారు. ప్రజల భక్తిని ఆధారంగా చేసుకుని సేకరించిన నిధులు ఎక్కడికి వెళ్లాయో ట్రస్ట్, దాని నాయకత్వం ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉందని విజయన్ డిమాండ్ చేశారు. అయోధ్య రామమందిర నిధుల దుర్వినియోగం సంఘ్ పరివార్ రాజకీయాల అసలు స్వరూపాన్ని బయటపెట్టే తాజా ఉదాహరణ అని ఆరోపించారు.
అయోధ్య రామ మందిర విరాళాల వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే. ఈ విషయంలో యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్.. విచారణ జరిపి యోగి సర్కారుకు ఇప్పటికే ప్రాథమిక నివేదికను సైతం సమర్పించింది. ఈ నేపథ్యంలో రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా శుక్రవారం రాజీనామా చేశారు. రామమందిరానికి వచ్చిన విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు రావడం, ఆ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు కావడం తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఈ ఎఫ్ఐఆర్లో అనుకల్ప్ మిశ్రా, లవ్కుశ్ మిశ్రా, అవినాశ్ శుక్లా, టిన్నూ యాదవ్, మనీశ్ యాదవ్తో పాటు మరికొందరి పేర్లను చేర్చారు. సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) మాజీ ఎమ్మెల్యే పవన్ పాండే చేసిన ఆరోపణలతో అయోధ్య విరాళాల వివాదం తెరపైకి వచ్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ వివాదం రాజకీయంగానూ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న యూపీలో అయోధ్య రామమందిర విరాళాల వివాదంతో అధికార బీజేపీకి రాజకీయంగా గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.
ప్రధాని మోడీ దేశానికి సమాధానం చెప్పాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



