10వేల మంది టీచర్లకు ప్రమోషన్… ఏ క్షణంలోనైనా ఆర్డర్స్

నవతెలంగాణ – హైదరాబాద్‌: రాష్ట్రంలోని మల్టీ జోన్‌-1(వరంగల్‌) పరిధిలోని 19 జిల్లాల్లో దాదాపు 10 వేల మంది ఉపాధ్యాయులు స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్ల పొందనున్నారు. ఇందుకు సంబంధించి ఏ క్షణమైనా ఉత్తర్వులు వెల్లడి కావచ్చని సమాచారం. ఆ వెంటనే వారికి కేటాయించిన కొత్త స్థానాల్లో చేరనున్నారు. భాషా పండితులు, పీఈటీలతోపాటు సెకండరీ గ్రేడ్‌ టీచర్లు(ఎస్‌జీటీ) కూడా ఆయా సబ్జెక్టు నిపుణులుగా పదోన్నతి పొందనున్నారు. ఉద్యోగోన్నతి పొందే మొత్తం టీచర్లలో 5,800 మందికిపైగా భాషా పండితులు, పీఈటీలే ఉన్నారు. రాష్ట్రంలోని భాషా పండితులు, పీఈటీల 15 ఏండ్ల కల ఫలిస్తూ.. స్కూల్‌ అసిస్టెంట్లుగా ఎట్టకేలకు పదోన్నతి పొందనున్నారు. మల్టీ జోన్‌-1లోని 19 జిల్లాల్లో సుమారు 4,900 మంది భాషా పండితులు, 900 మంది పీఈటీలు ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్‌లో 454 మంది భాషా పండితులు, ఖమ్మం జిల్లాలో 107 మంది పీఈటీలు పదోన్నతి అందుకోనున్నారు. దీంతో భాషా పండితులు.. స్కూల్‌ అసిస్టెంట్‌ భాషా ఉపాధ్యాయులు, పీఈటీలు.. స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ డైరెక్టర్లు అవుతారు. వారిలో నాలుగో వంతు మందికి రెండు ఇంక్రిమెంట్లు దక్కనున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో మల్టీ జోన్‌-2(హైదరాబాద్‌)లోని 14 జిల్లాల్లో కూడా పదోన్నతులు లభించనున్నాయి.

Spread the love