నవతెలంగాణ – హైదరాబాద్ : దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో మోడీ విదేశాల్లో పర్యటిస్తున్నారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. సొంత నియోజకవర్గమైన రాయ్బరేలీలో పర్యటించిన ఆయన చురువా హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దేశంలో సంక్షోభ పరిస్థితులు ఉన్నాయని.. ప్రజలను బయటకు వెళ్లొద్దని ప్రధాని పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఆయనేమో ప్రపంచమంతా చుట్టేస్తున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు.
ముందుముందు దేశంపై ఒక పెద్ద ఆర్థిక తుపాను విరుచుకుపడబోతోందని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ‘‘రాబోయే ఆర్థిక సంక్షోభం అదానీ, అంబానీ, మోడీని ఏమీ చేయలేదు. వాళ్లంతా తమ ప్యాలెస్లలో భద్రంగా ఉంటారు. కానీ దేశ యువత, సామాన్య ప్రజలు దీనివల్ల తీవ్రంగా దెబ్బతింటారు. ఇంతకుముందెన్నడూ చూడని భయంకరమైన ఆర్థిక సంక్షోభాన్ని దేశం చూడబోతోంది. కష్టకాలం ముందుంది. మోడీ ఆర్థిక విధానాలే ఇందుకు కారణం’’ అని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు.



