నేడు తెలంగాణకి రానున్న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే

నవతెలంగాణ- హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ రాష్ట్రానికి వస్తున్నారు. రాహుల్ గాంధీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక, వరంగల్ జిల్లా నర్సంపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఆ నియోజకవర్గాల్లో నిర్వహించనున్న కాంగ్రెస్ విజయభేరీ సభల్లో పాల్గొంటారు. ఉదయం 11:30 నిమిషాలకు రాహుల్ విజయవాడ నుంచి హెలికాప్టర్ ద్వారా మణుగూరుకు చేరుకుంటారు. పినపాకలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి వరంగల్ జిల్లా నర్సంపేటకు చేరుకుని బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3:00 గంటలకు నర్సంపేట నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చేరుకుంటారు. పార్టీ శ్రేణులతో కలిసి నగరంలో పాదయాత్రలో పాల్గొని, అనంతరం సమావేశంలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. సాయంత్రం 5:15 నిమిషాలకు వరంగల్ పర్యటన ముగించుకుని హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్​కు వెళ్తారు. రాహుల్ గాంధీకి ఘనస్వాగతం పలికేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు.

Spread the love