రాహుల్ గాంధీ మాటలు విడ్డూరం : మంత్రి హరీష్ రావు

– కాళేశ్వరం నిర్మాణంలో అవినీతా?
నవ తెలంగాణ – సిద్దిపేట
కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ చెప్పడం విడ్డురంగా ఉందని,  ఖర్చు పెట్టింది 80 వేల కోట్లు అయితే అవినీతి ఏలా జరుగుతుందని రాహుల్ గాంధీ వాఖ్యల పై రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ ఎద్దేవా చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క చెరువు అయినా బాగు చేశారా.? నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ వాళ్లది నోరా.. మోరా..? అంటూ  మంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రంగనాయక సాగరులో ముంచి లేవడితే కాంగ్రెస్ నాయకులకు నీళ్ళు ఉన్నవి, లేనిది తెలుస్తది కావొచ్చునని అన్నారు.
       సిద్ధిపేట పత్తి మార్కెట్ యార్డులో బుధవారం ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ, తెలంగాణ ఆయిల్ ఫెడ్  ఆధ్వర్యంలో రైతులకు స్పింక్లర్లు-తుంపర సేద్య పరికరాలు పంపిణీ, ఆయిల్ ఫామ్ సాగు  సదస్సు నిర్వహించారు.   1001 స్పింక్లర్లు-తుంపర సేద్య పరికరాలు రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం పూర్తి చేశాం కాబట్టే భూమికి బరువైన పంట పండుతున్నదాని,  కాళేశ్వరం పని కానిదే ఈ ఘనత సాధ్యమౌతదా అన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లాలో కేవలం 300 స్పింక్లర్లు సెట్లు పంచేదని, కానీ ఇవాళ ఒక్కరోజు 1001 మందికి స్పింక్లర్లు పంపిణీ చేసుకుంటున్నామని, ఇప్పటికే సిద్ధిపేట జిల్లాలో రెండేళ్లలో 15 వేల స్పింక్లర్లు సెట్లు ఇచ్చామని, చిన్నకోడూర్ మండలంలోనే 5100 స్పింక్లర్లు సెట్లు ఇచ్చామని గుర్తు చేశారు.  15 వేల స్పింక్లర్లు సెట్లు పంపిణీ చేసేందుకు రూ.20 కోట్ల 18 లక్షల రూపాయలు సబ్సిడీ ప్రభుత్వం భరించిందని, ఇది రైతుల పట్ల ప్రేమ, చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.  ఈ యేడు కాలమయ్యే అంశం పై సీఎం కేసీఆర్ సమీక్షించి రైతు శ్రేయస్సు కోసం ఆలోచన చేశారని, రైతులకు కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి కాల్వల ద్వారా నీళ్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.
     గతంలో రైతులు ముఖాన్ని మొగులుకు పెట్టి చూసేవారు కానీ, ఇప్పుడు సీఎం కేసీఆర్, కాళేశ్వరం పై నమ్మకంతో నారు పోస్తున్నారని పేర్కొన్నారు.
ఎన్నికల కోసం ఆపద మొక్కులు మొక్కే వారికి దండం పెట్టాలి. గత ప్రభుత్వాల హయాంలో దొంగరాత్రి కరెంటు వచ్చేదని, కానీ ఇవాళ సీఎం కేసీఆర్ నాయకత్వంలో 24 గంటలు నాణ్యమైన కరెంటు సరఫరా జరుగుతున్నదని అన్నారు. రైతులు గుండెజారి పోవొద్దని, రైతుల కోసం చుక్క చుక్క ఒడిసి పట్టి కాళేశ్వరం జలాశయాలు నింపాలని సీఎం కేసీఆర్ స్పష్టంగా ఆదేశించారని, కాలం ఎత్తి పోయినా.. కాళేశ్వరం గేట్లు ఎత్తి రైతులకు కాల్వల ద్వారా పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.
     కాళేశ్వరంతో యాసంగిలో 55 లక్షల ఎకరాల పంట పండిందని,  పండిన పంట 26 వేల కోట్లు రూపాయల ధాన్యం కొన్నామని, తొమ్మిదేళ్ల స్వరాష్ట్ర పాలనలో రైతులకు కరెంటుకు 60 వేల కోట్లు వెచ్చించినట్లు, 72 వేల కోట్లు రైతుబంధు కింద, రైతుభీమా కింద ఒక్కో రైతుకు లక్ష చొప్పున మొత్తం 5300 కోట్లు అందించినట్లు తెలిపారు. ఎండమావులకు ఆశపడొద్దు, ధోకే బాజ్ లకు లొంగొద్దని రైతులకు మంత్రి హితవు పలికారు. చేర్యాల ప్రాంత రైతులకు మంత్రి శుభవార్త అని,  దేవాదుల నీళ్లు తెచ్చి తపాస్ పల్లి రిజర్వాయరు నింపుతామని, మల్లన్న సాగర్, రంగనాయక, కొండ పోచమ్మ, అంతగిరి, గౌరవెల్లి రిజర్వాయర్లు నింపి రైతులకు కాల్వల ద్వారా పంట పొలాలకు నీళ్లు అందిస్తామని భరోసా ఇచ్చారు. గతంలో వర్షాధార పంటలుగా పత్తి, మొక్క జొన్న, జొన్న వంటి పంటలు మాత్రమే వేసేదని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద నమ్మకంతో ఇప్పటికీ నార్లు వేశారని పేర్కొన్నారు.
      కేంద్ర ప్రభుత్వం నూకలు తినమని చెప్తే ముఖ్యమంత్రి కేసీఆర్ నూకల ఖర్చు భరించి అందరికీ బియ్యం అందిస్తున్నారని అన్నారు. జిల్లాలో 8 వేల 500 ఏకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేసినట్లు, ఈ సంవత్సరం 18000 ఎకరాలు టార్గెట్ పెట్టుకున్నట్లు, ఆయిల్ ఫామ్ ద్వారా ఎకరాకు లక్ష రూపాయల వరకు ఆదాయం ఉన్నదని, ఆయిల్ ఫామ్ లాభాల పంటగా ఎకరాకు 80 వేల రూపాయల వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నదని అన్నారు. పంట కాలాన్ని నెల ముందుకు తేవాలని, తప్పుడు వాన బాధ తప్పాలని రైతులకు అవగాహన కల్పిస్తూ.. వరి బదులుగా ప్రత్యామ్నాయ పంట మార్పిడి చేయాలని, పంట మార్పిడి విధానం వల్ల పంటలు బాగా పండుతాయని, వెదజల్లే పద్ధతిన వరి సాగు చేయాలని రైతులను కోరారు. ఆయిల్ ఫెడ్ సిద్ధిపేట జిల్లా కమిటీ మెంబర్లను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు నాగిరెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ వైస్ ఛైర్మన్ సోమిరెడ్డి, జిల్లాలోని పలు మండలాల ఏంపీపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి సునీత, అధికార సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love