సల్మాన్ ఖాన్ కాల్పుల కేసు నిందితుడు ఆత్మహత్య

నవతెలంగాణ – హైదరాబాద్: బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద కాల్పులు జరిపిన కేసులో అరెస్టైన నిందితుడు అనూజ్ థాపన్(23) జైల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసుల కస్టడీలో ఉన్న అనూజ్ బుధవారం మధ్యాహ్నం లాకప్లో ఉన్న టాయిలెట్లో బెట్ షీట్తో ఉరివేసుకున్నాడు. గమనించిన తోటి ఖైదీలు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ముంబయిలో ఉన్న గోకుల్ దాస్ తేజ్ పాల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనూజ్ థాపన్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఏప్రిల్‌ 14న సల్మాన్ ఖాన్ నివాసం ఉంటున్న ముంబయి బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్మెంట్ వద్దకు బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం దుండగులు బైక్పై వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా కాల్పులు జరిపిన నిందితులు విక్కీ గుప్తా, సాగర్‌ పాల్ను అరెస్టు చేశారు. అనంతరం వీరికి ఆయుధాలు సరఫరా చేశారన్న ఆరోపణలపై అనూజ్‌ థాపన్, సోనూ సుభాశ్‌ చందర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Spread the love