మేయర్ విజయలక్ష్మి ఇంట్లోకి చొరబడిన రౌడీ షీటర్..

నవతెలంగాణ – హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ బంజారహిల్స్‌లోని ఎన్‌బీటీ నగర్‌లో సంచలనం చోటుచేసుకుంది. పట్టపగలే యూసఫ్‌గూడకు చెందిన రౌడీ షీటర్ లక్ష్మణ్ హల్‌చల్ సృష్టించాడు. అర్ధరాత్రి ఏకంగా మేయర్ విజయలక్ష్మి ఇంట్లోకి చొరబడ్డాడు. అనంతరం ఆమె గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా సిబ్బంది అతడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తనకు ఓ సమస్య ఉందని అదే విషయమై విజయలక్ష్మితో మాట్లాడాలంటూ కాసేపు సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో మేయర్ విజయలక్ష్మి ఇంట్లో లేరని తెలుస్తోంది. ఆమె తండ్రి కేశవరావుకు ఇటీవలే మోకాలికి శస్త్ర చికిత్స జరగడంతో ఆమె ఆసుపత్రిలోనే ఉన్నట్లుగా సమాచారం. మేయర్ సిబ్బంది ఫిర్యాదు మేరకు రౌడీ షీటర్ లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని బంజారా‌హిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Spread the love