ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ సమన్లు

Arvind Kejriwalనవతెలంగాణ – న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఈడీ మరోసారి నోటీసులు జారీచేసింది. మార్చి 21న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నది. కాగా, ఢిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీచేయడం ఇది తొమ్మిదోసారి. గత ఎనిమిది నోటీసులకు స్పందించని ఆయన విచారణకు గైర్హాజరవుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌పై కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసింది. అప్పుడు విచారణ జరిపిన ధర్మాసనం ఫిబ్రవరి 17న కోర్టుకు రావాలని ఆదేశించింది. అయితే ఆయన వర్చువల్‌గా కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉండగానే కేజ్రీవాల్‌కు ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. చివరిసారిగా మార్చి 4న విచారణకు రావాలని పిలవగా.. సీఎం గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ మరోసారి కోర్టును ఆశ్రయించింది. దీంతో మార్చి 16న తప్పనిసరిగా తమ ఎదుట హాజరుకావాలని కోర్టు కేజ్రీవాల్‌ను ఆదేశించింది. కవిత అరెస్టుతో స్వయంగా హాజరవ్వాలని కేజ్రీవాల్‌ నిర్ణయించుకొన్నట్టు తెలిసింది. ఈడీ అభియోగాలపై విచారించిన కోర్టు.. అవి బెయిల్‌ పొందడానికి అవకాశం ఉన్న సెక్షన్లేనని పేర్కొంటూ కేజ్రీవాల్‌కు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. తాజాగా మరోసారి సమన్లు జారీచేయడం గమనార్హం.

Spread the love