బ్రిజ్‌ భూషణ్‌‌ కొడుకుకు ఎంపీ టికెట్..?

నవతెలంగాణ-హైదరాబాద్ : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఆరుగురు మహిళా రెజ్లర్లు ఢిల్లీలో సుదీర్ఘ నిరసన తెలపడాన్ని ప్రపంచంలోని ప్రముఖ మీడియా సంస్థలన్నీ కవర్ చేశాయి. ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్‌ సిట్టింగ్ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణే. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఈయన ప్రతిష్ఠ మసకబారింది. దీంతో ఈసారి బ్రిజ్ భూషణ్‌కు కైసర్‌గంజ్‌ లోక్‌సభ టికెట్ ఇవ్వొద్దని బీజేపీ పెద్దలు నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయంలో ఒక ట్విస్ట్ ఉంది. ఈదఫా కైసర్‌గంజ్‌ స్థానాన్ని బ్రిజ్ భూషణ్‌ కుమాారుడు కరణ్‌ భూషణ్‌ సింగ్‌‌కు కేటాయించాలని కాషాయ పార్టీ పెద్దలు యోచిస్తున్నారట. ఈవిషయాన్ని ఇప్పటికే బ్రిజ్ భూషణ్‌‌కు తెలియజేశారట. కరణ్‌ భూషణ్‌ సింగ్‌‌ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కైసర్‌గంజ్‌ నుంచి పోటీచేసిన బ్రిజ్‌ భూషణ్‌ .. సమీప ప్రత్యర్థి బీఎస్పీకి చెందిన చంద్రదేవ్ రామ్ యాదవ్‌పై 2.5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అంతకుముందు 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచి గెలుపు బ్రిజ్ భూషణ్‌నే వరించింది. ఇంకా ముందుకు వెళితే.. 1996 నుంచి 2009 సంవత్సరం వరకు కైసర్‌గంజ్ లోక్‌సభ సీటును సమాజ్‌వాదీ పార్టీ నేత బేణి ప్రసాద్ వర్మ వరుసగా గెలిచారు.

Spread the love