అమిత్ షా ఫేక్ వీడియో కేసు..ముగ్గురు తెలంగాణ కాంగ్రెస్ నేతల అరెస్ట్

నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోల కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ బిజెపి నేత ప్రేమేందర్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జి మన్నె సతీశ్, నవీన్, తస్లీమాను అరెస్ట్ చేసి సెంట్రల్ క్రైం స్టేషన్‌కు తరలించారు. కాగా, ఇదే కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మొన్ననే ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అస్సాం కాంగ్రెస్ యూనిట్ వార్ రూమ్ కోఆర్టినేటర్ రితోమ్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా మరో 10 మంది కాంగ్రెస్ నాయకులకు నోటీసులు జారీ చేశారు. తాజాగా, ప్రేమేందర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు ముగ్గురు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు అమిత్‌షా వీడియో మార్ఫింగ్ కేసు విచారణకు సంబంధించి ఢిల్లీ పోలీసులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. నేరుగా గాంధీభవన్‌కు ఢిల్లీ పోలీసులు సిఐ రామ్‌నివాస్‌తోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చారు. లీగల్ సెల్ ఇన్‌ఛార్జ్ రామచంద్రారెడ్డి కోసం ఆరా తీశారు. ఆయన లేకపోవడంతో అక్కడి నుంచి ఢిల్లీ పోలీసులు వెళ్లిపోయారు. గాంధీభవన్‌కు ఎందుకు వచ్చారని ఢిల్లీ పోలీసులను ప్రశ్నించారు. బేగంబజార్ పోలీసుస్టేషన్ ఆఫీసర్ విజయ్‌కుమార్. అడ్వకేట్ రామచంద్రారెడ్డితో మాట్లాడాలని సమాధానం ఇచ్చారు. ఐదు నిమిషాల్లో తిరిగి వెళ్లిపోయారు. మరోసారి నలుగురికి నోటీసులు ఇచ్చేందుకు వచ్చినట్లు సమాచారం.

Spread the love