SRH vs RR : హెడ్‌, నితీశ్‌రెడ్డి హాఫ్‌ సెంచరీ..రాజస్థాన్‌ టార్గెట్‌ ఎంతంటే..!

నవతెలంగాణ-హైదరాబాద్ : రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. రాజస్థాన్‌ బౌలర్ల ధాటికి ముందుగా తడబడినప్పటికీ.. తర్వాత హైదరాబాద్‌ బ్యాటర్లు దూకుడు చూపించారు. హెడ్‌, నితీశ్‌రెడ్డి చెరో హాఫ్‌ సెంచరీతో చెలరేగి ఆడారు. వారికి క్లాసెన్‌ కూడా తోడయ్యాడు. దీంతో కష్టపడి స్కోర్‌ను 200 దాటించారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్‌ 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. రాజస్థాన్‌ ముందు 202 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌తో రికార్డు సృష్టించిన హైదరాబాద్‌ ఆటగాళ్లను రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్లు ఆది నుంచి కట్టడి చేశారు. దీంతో పవర్‌ ప్లే ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 37 పరుగుల వద్దే పరిమితమైంది. ఐదో ఓవర్‌లో అవేశ్‌ ఖాన్‌ వేసిన తొలి బంతికి షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి అభిషేక్‌ (12) ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అన్‌మోల్‌ప్రీత్‌(5) తొలి బంతికే ఫోర్‌ బాదాడు. కానీ ఆరో ఓవర్‌లో సందీప్‌ శర్మ వేసిన బంతికి జైస్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. రాజస్థాన్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడంతో రెండు కీలక వికెట్లను కోల్పోయిన సన్‌రైజర్స్‌ కాసేపు నిలకడగా ఆడింది. కానీ 9వ ఓవర్‌ నుంచి ట్రావిస్‌ హెడ్‌ (58) దూకుడు పెంచాడు. అతనికి నితీశ్‌రెడ్డి జత కలిశాడు. దీంతో ఇద్దరూ కలిసి చెరో హాఫ్ సెంచరీతో జట్టుకు కీలకమైన స్కోర్‌ అందించారు. అయితే అవేశ్‌ ఖాన్‌ వేసిన 15వ ఓవర్‌లో మూడో బంతికి స్టంపౌట్‌ నుంచి తప్పించుకున్నప్పటికీ.. నాలుగో బంతికి హెడ్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. హెడ్‌ ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన క్లాసెస్‌ (40) కూడా రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోర్‌ను ఎట్టకేలకు 200 దాటించారు. రాజస్థాన్‌ ముందు 202 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు.

Spread the love