
నవతెలంగాణ – మల్హర్ రావు
భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ సతీమణి మాత రమాబాయి అంబేద్కర్ 126వ జయంతిఉత్సవాలను పురస్కరించుకుని అల్ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ 542 (ఏఈడబ్ల్యుఎస్) జాతీయ అధ్యక్షురాలు వేముల జ్యోతి, రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్ల శంకర్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 11న ఆదివారం మల్హర్ మండలంలోని కొయ్యుర్ కమ్యూనిటీ హాల్లో రమాబాయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అల్ ఎంప్లాయిస్ సొసైటీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్ల శంకర్, కాళేశ్వరం జోనల్ యూత్ అధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్ తెలిపారు. మండల కేంద్రమైన తాడిచెర్లలోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం మండల ఎంపీపీ చింతలపల్లి మల్హర్ రావు, ఎంపీడీఓ నరసింహామూర్తి, ఏపీఓ హరీష్ లు జయంతి ఉత్సవాల ఆహ్వాన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా సొసైటీ సభ్యులు మాట్లాడారు. అల్ ఎంప్లాయిస్ సొసైటీ ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో, ఈ జయంతి ఉత్సవాలను, మాజీ సర్పంచ్ ల సన్మానోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మెరుగైన సమాజ నిర్మాణం, కృషి చేయాలనుకునేవారు, మహనీయుల అభిమానులు మంథని, కాటారం డివిజన్ల నుంచి ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, అంబేద్కర్ వాదులు, విద్యార్థులు, మేధావులు, కులమత, లింగ విబేధాలు లేకుండా సబ్బండ వర్గాల ప్రజలు, వందలాదిగా, స్వచ్ఛందగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈఉత్సవాలకు హాజరైన ప్రతి ఒక్కరికి సొసైటీలో ఉన్న వనరుల మేరకు మాత రమాబాయి జీవిత చరిత్ర గ్రంధాలను ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బండి సుధాకర్,చొప్పరి రాజయ్య, ఎంపీడీఓ సిబ్బంది, ఉపాది హామీ సిబ్బంది పాల్గొన్నారు.