నవతెలంగాణ – హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి దేశ అత్యున్నత న్యాయ స్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలుచేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన రేవంత్రెడ్డి చంచల్గూడ జైలుకు వెళ్లారు. బెయిల్పై బయటకు వచ్చిన అనంతరం దాఖలు చేస్తూ వచ్చిన కేసులు వీగిపోతూ ఉన్నాయి. తొలుత ట్రయల్ కోర్టు, ఆపై హైకోర్టు, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆయనకు చుక్కెదురైంది. రేవంత్రెడ్డి దాఖలుచేసిన రెండు వ్యాజ్యాలను న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం మంగళవారం కొట్టివేసింది. ఓటుకు నోటు కేసులోని ఐదుగురు సాక్షులను ఒకేసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని ఒక పిటిషన్, ఓటుకు కోట్ల రూపాయలు ఇచ్చారనే అభియోగాల కేసు ఏసీబీ పరిధిలోకి రాదని పేర్కొంటూ మరో పిటిషన్ దాఖలు చేయగా వాటిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. సాక్షులను ఎలా విచారణ చేయాలో హైకోర్టు/సుప్రీంకోర్టులు నిర్ణయించలేవని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారం తెలంగాణ హైకోర్టులో ఉన్నదని, అక్కడే తేల్చుకోవాలని స్పష్టం చేసింది.