రూ.2 వేల కోట్లు నష్టపోయిన రిషి సునాక్ దంపతులు..

నవతెలంగాణ-హైదరాబాద్ : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆయన అర్ధాంగి అక్షత మూర్తి ఏడాది కాలంలో రూ.2,069 కోట్లు నష్టపోయారు. బ్రిటీష్ ప్రధాని పీఠం అలంకరించిన వారిలో అత్యంత సంపన్నుడు రిషి సునాక్. ఆయన భార్య అక్షత మూర్తి పేరిట కూడా భారీగా షేర్లు ఉన్నాయి. ఈ జంట బ్రిటన్ కుబేరుల జాబితాలో 275వ స్థానంలో ఉందని సండే టైమ్స్ మీడియా సంస్థ పేర్కొంది. అయితే, గత 12 నెలల వ్యవధిలో వీరి సంపద తరుగుతూ వచ్చింది. గతేడాది సునాక్, అక్షత దంపతుల ర్యాంకు 222 గా, ఇప్పుడది మరింత పతనమైంది. ఇన్ఫోసిస్ సంస్థలో రిషి సునాక్ దంపతుల వాటా విలువ తగ్గిపోవడంతో ఈ సంపద క్షీణత చోటుచేసుకున్నట్టు భావిస్తున్నారు. రిషి సునాక్ పెళ్లాడిన అక్షత మూర్తి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అని తెలిసిందే. ప్రస్తుతం, నష్టం మినహాయిస్తే రిషి సునాక్ నికర సంపద విలువ రూ.5,446 కోట్లు! గతేడాది అది రూ.7,515 కోట్లు కాగా, ఇన్ఫోసిస్ ఒడిదుడుకుల కారణంగా ఆ సంపదలో భారీగా ఆస్తి హరించుకుపోయింది.

Spread the love