– సెప్టెంబర్ 10లోపు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి
– వ్యవసాయ శాఖ మండల అధికారి శ్రీనివాస్
నవతెలంగాణ–అశ్వారావుపేట : ప్రభుత్వం సూచించిన ఏడు రకాల సన్న వడ్లను సాగు చేస్తున్న రైతులు సెప్టెంబర్ 10 లోపు తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ మండల అధికారి శ్రీనివాస్ కోరారు.
ప్రభుత్వం నిర్దేశించిన ఆర్ఎన్ఆర్ – 15048,బీపీటీ – 5204, డబ్ల్యూజీఎల్ – 44, కేఎన్ఎం – 1638, కేఎన్ఎం 7715, హెచ్ ఎంటీ సోనా,జై శ్రీరామ్ రకాల వరిని సాగు చేస్తున్న రైతులు మాత్రమే క్వింటాల్ కు రూ.500 లు బోనస్ కు అర్హులని తెలిపారు.
డీలర్ వద్ద విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, విత్తనాల కొనుగోలు బిల్లుతో సంబంధిత డీలర్ను సంప్రదించి పోర్టల్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. సొంత విత్తనం లేదా ఇతర రైతుల నుంచి పొందిన విత్తనాలను వినియోగిస్తున్న రైతులు రైతు ధ్రువీకరణ పత్రంతోపాటు సంబంధిత వివరాలను తమ పరిధిలోని ఏఈఓకు సమర్పించాలని తెలిపారు.
ఆన్లైన్లో నమోదు చేసిన రైతుల వివరాలను సివిల్ సప్లయ్స్ శాఖకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. పోర్టల్లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే క్వింటాల్కు రూ.500 బోనస్ అందుతుందని స్పష్టం చేశారు. అశ్వారావుపేట మండలంలోని వరి సాగు చేస్తున్న రైతులందరూ నిర్ణీత గడువులోగా పంట వివరాలను నమోదు చేసుకుని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలని కోరారు.



