Wednesday, September 16, 2026
E-PAPER
Homeఆటలుస్వీప్‌ చేస్తారా?

స్వీప్‌ చేస్తారా?

- Advertisement -

అఫ్గాన్‌‌తో భారత్‌ మూడో టీ20 నేడు
అవకాశం కోసం వైభవ్‌ ఎదురుచూపు
రాత్రి 7.30 గంటలకు ఆరంభం

టీ20 సిరీస్‌ ‌క్లీన్‌‌స్వీప్‌‌పై భారత్‌ ‌కన్నేసింది. అఫ్గనిస్తాన్‌‌తో టీ20 సిరీస్‌‌ను 2-0తో సొంతం చేసుకున్న టీమ్‌ ఇండియా.. నేడు 3-0 విజయం వేటలో బరిలోకి దిగుతోంది. ఇటు బ్యాటింగ్‌, అటు బౌలింగ్‌ ‌విభాగాల్లో కొందరు ఆటగాళ్లకు విశ్రాంతి, కొందరు ఆటగాళ్లకు అవకాశం అందించాలనే ఆలోచన కనిపిస్తోంది. భారత్‌, అఫ్గనిస్తాన్‌ ‌మూడో టీ20 నేడు.

​నవతెలంగాణ-న్యూఢిల్లీ
వరుసగా రెండు టీ20ల్లో భారత్‌ ఏకపక్ష విజయాలు సాధించింది. బ్యాటర్లు, బౌలర్లు ప్రత్యర్థిపై పంజా విసిరారు. నేడు మూడో మ్యాచ్‌‌లో ఆ తరహా ప్రదర్శన పునరావృతం చేస్తారా? మిడిల్‌ ఆర్డర్‌ నుంచి ఎవరైనా జూలు విదుల్చుతారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఆసియా క్రీడల ముంగిట టీమ్‌ ఇండియా ప్రయోగాలు చేస్తుందా? లేదంటే అదే జట్టుతో బరిలోకి దిగుతుందా చూడాలి.

​వైభవ్‌ ఎదురుచూపు
యువ సంచలనం వైభవ్‌ ‌సూర్యవంశీ స్వదేశంలో తొలి టీ20 ఆడేందుకు తహతహ లాడుతున్నాడు. బ్రిటన్‌ ‌పర్యటనలో అరంగేట్రం చేసిన వైభవ్‌ ‌సూర్యవంశీ సొంతగడ్డపై ఆడాలని ఎదురుచూస్తున్నాడు. ప్రాక్టీస్‌ ‌సెషన్లో చురుగ్గా కనిపించిన వైభవ్‌‌కు అవకాశం కల్పిస్తే.. సంజు శాంసన్‌‌ను బెంచ్‌‌కు పరిమితం చేయాల్సి ఉంటుంది. గత మ్యాచ్‌‌లో విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడిన శాంసన్‌‌ను పక్కనపెడతారా? అనేది అనుమానమే. జింబాబ్వే పర్యటనలో తుది జట్టు కూర్పులో లక్ష్మణ్‌, శ్రేయస్‌ అయ్యర్‌ ‌కొన్ని ప్రయోగాలు చేశారు. అవి విజయవంతం అయ్యాయి. గంభీర్‌, శ్రేయస్‌ ‌జోడీ సైతం అటువంటి మార్పులకు సిద్ధంగా ఉందా లేదా అనేది నేడు తేలనుంది. కెప్టెన్‌ ‌శ్రేయస్‌ అయ్యర్‌, తిలక్‌ ‌వర్మపై జట్టు మేనేజ్‌‌మెంట్‌ ‌భారీ అంచనాలు పెట్టుకుంది. టాప్‌ ఆర్డర్‌‌లో అభిషేక్‌ ‌శర్మ, సంజు శాంసన్‌, ఇషాన్‌ ‌కిషన్‌‌లు రాణిస్తున్నారు. దీంతో మిడిల్‌ ఆర్డర్‌‌పై పెద్దగా ఫోకస్‌ ఉండటం లేదు. టాప్‌ ‌విఫలమైతే.. ఆ పరిస్థితుల్లో జట్టును ముందుకు తీసుకెళ్లగల ఇన్నింగ్స్‌‌లు కెప్టెన్‌, వైస్‌ ‌కెప్టెన్‌ ఆడాల్సి ఉంది. ఆల్‌‌రౌండర్లు అక్షర్‌ ‌పటేల్‌, నితిశ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఆశావహ ప్రదర్శన కనబరచటం సానుకూలం. పేస్‌ ‌దళపతి జశ్‌‌ప్రీత్‌ బుమ్రా విశ్రాంతి కోరుకుంటే.. యశ్‌ ‌ఠాకూర్‌‌కు అరంగేట్రం ఖాయమని చెప్పవచ్చు.

​అఫ్గాన్‌‌కు ఊరట దక్కేనా?
అఫ్గనిస్తాన్‌ ‌పసికూన ముద్రను దాటేసి.. అగ్ర జట్లకు సవాల్‌ ‌విసిరే స్థాయికి వచ్చింది. టెస్టులు, వన్డేలతో పోల్చితే టీ20 ఫార్మాట్‌‌లో అఫ్గనిస్తాన్‌‌కు మంచి రికార్డుంది. అయినా, తొలి రెండు మ్యాచ్‌‌ల్లో భారత్‌‌కు దీటుగా ఆడటంలో అఫ్గాన్‌ ‌విఫలమైంది. పేసర్లు, స్పిన్నర్లు భారత బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. భారత బౌలర్లను ఎదుర్కొని పరుగులు చేయటంలో బ్యాటర్లు తేలిపోయారు. ఫలితంగా బ్యాట్‌, బంతితో అఫ్గాన్‌ ‌కనీస పోటీ ఇవ్వలేకపోయింది. వరుస మ్యాచ్‌‌ల్లో భారత్‌ ఆడుతూపాడుతూ లక్ష్యాలను ఛేదించింది. మూడో మ్యాచ్‌‌లోనైనా విజయం సాధించి ఊరట దక్కించుకోవాలని అఫ్గాన్‌ ఆశిస్తోంది. రషీద్‌ ‌ఖాన్‌, రెహ్మనుల్లా గుర్బాజ్‌, ముజీబ్‌ ‌రెహమాన్‌, ఫరూకీ, ఇబ్రహీం జద్రాన్‌, మహ్మద్‌ ‌నబి అఫ్గనిస్తాన్‌‌కు కీలకం కానున్నారు.

తుది జట్లు (అంచనా)
భారత్‌ : అభిషేక్‌ ‌శర్మ, సంజు శాంసన్‌ (‌వికెట్‌ ‌కీపర్‌), ఇషాన్‌ ‌కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ (‌కెప్టెన్‌), తిలక్‌ ‌వర్మ, అక్షర్‌ ‌పటేల్‌, నితీశ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, రవి బిష్ణోయ్‌, యశ్‌ ‌ఠాకూర్‌, అర్ష్‌‌దీప్‌ ‌సింగ్‌, జశ్‌‌ప్రీత్‌ ‌బుమ్రా.

అఫ్గనిస్తాన్‌ : రెహ్మనుల్లా గుర్బాజ్‌ (‌వికెట్‌ ‌కీపర్‌), ఇబ్రహీం జద్రాన్‌ (‌కెప్టెన్‌), సెదీఖుల్ల అటల్‌, గుల్బాదిన్‌ ‌నయిబ్‌, డార్విశ్‌ ‌రసూల్‌, అజ్మతుల్లా ఓమర్‌‌జాయ్‌, మహ్మద్‌ ‌నబి, రషీద్‌ ‌ఖాన్‌, ముజీబ్‌ ‌రెహమాన్‌, ఫజల్‌‌హాక్‌ ‌ఫరూకీ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -