రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై తలో దారి

Disagreements exposed at the UN meeting– ఐరాస భేటీలో బట్టబయలైన విభేదాలు
న్యూయార్క్‌ : సోమవారం జరిగిన ఐరాస సర్వసభ్య సమావేశంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సమావేశం రెండు తీర్మానాలను ఆమోదించగా ఓటింగుకు భారత్‌ గైర్హాజరు అయింది. వీటిలో ఒక దానికి ఉక్రెయిన్‌, యూరోపియన్‌ యూనియన్‌ మద్దతు ఇవ్వగా మరో తీర్మానాన్ని అమెరికా ప్రతిపాదించింది. అయితే అట్లాంటిక్‌ దేశాలు కొన్ని సవరణల ద్వారా తీర్మానాల్లో మార్పులు చేశాయి. ఉక్రెయిన్‌ యుద్ధంపై చర్చించేందుకు అమెరికా, ఫ్రాన్స్‌ అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇమ్మానుయేల్‌ మాక్రాన్‌ వాషింగ్టన్‌లో సమావేశమైన సమయంలోనే పశ్చిమ దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం గమనార్హం. కాల్పుల విరమణ ఏ మేరకు విజయం సాధించిందన్న విషయంపై ఇరువురు నేతలు పరస్పర విరుద్ధంగా స్పందించారు. రష్యాకు ఉక్రెయిన్‌ శాశ్వతంగా భూమిని కోల్పోవాల్సిందేనని అమెరికా అంటోంది. దీనిపై మాక్రాన్‌ స్పందిస్తూ ‘శాంతి అంటే ఉక్రెయిన్‌ లొంగిపోవడం కాదు. గ్యారంటీలు లేకుండా కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు అర్థమూ కాదు’ అని స్పష్టం చేశారు.
సర్వసభ్య సమావేశంలో…
యుద్ధంపై రష్యాకు వ్యతిరేకంగా ఈయూ, ఉక్రెయిన్‌ తీర్మానాన్ని ప్రతిపాదించగా అమెరికా, రష్యా, బెలారస్‌, ఉత్తర కొరియా వ్యతిరేకంగా ఓటేశాయి. తీర్మానానికి అనుకూలంగా 93 ఓట్లు, వ్యతిరేకంగా 18 ఓట్లు వచ్చాయి. 65 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయాయి. రష్యా ప్రతిపాదించిన సవరణ కూడా వీగిపోయింది. ఇక అమెరికా ప్రతిపాదించిన తీర్మానానికి యూరోపియన్‌ దేశాలు భారీగా సవరణలు ప్రతిపాదించాయి. ఇవన్నీ ఉక్రెయిన్‌కు అనుకూలమైనవే. అమెరికా తీర్మానాన్ని ఐరాస సమావేశం ఆమోదించినప్పటికీ చివరికి దానిని ట్రంప్‌ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సవరణలకు 93 దేశాలు అనుకూలంగా ఓటేయగా కేవలం 8 దేశాలు మాత్రమే వ్యతిరేకించాయి. 73 దేశాలు ఓటింగుకు గైర్హాజరు అయ్యాయి.
ఓటింగుకు దూరంగా భారత్‌
అందరూ భావించినట్లుగానే రెండు తీర్మానాలపై జరిగిన ఓటింగుకు భారత్‌ దూరంగా ఉంది. రష్యాను విమర్శిస్తూ ఈయూ ప్రతిపాదించిన తీర్మానంపై జరిగిన ఓటింగులో భారత్‌ పాల్గొనలేదు. గత మూడు సంవత్సరాల కాలంలో భారత ప్రభుత్వం ఇంత బహిరంగంగా ఎన్నడూ తన వైఖరిని బహిర్గతం చేయలేదు. అమెరికా ప్రతిపాదించిన తీర్మానంలో కఠినమైన భాషను వాడకపోవడంతో దానికి మద్దతుగా భారత్‌ ఓటింగులో పాల్గొంటుందని అందరూ అనుకున్నారు. అయితే రష్యా ఆక్రమణను వ్యతిరేకిస్తూ సవరణ ప్రతిపాదించగానే భారత్‌ ఓటింగుకు దూరమైంది. ఐరాసలో ఉక్రెయిన్‌పై గతంలో చేసిన తీర్మానాల విషయంలో ఎలా వ్యవహరించిందో ఇప్పుడూ అదే వైఖరి తీసుకుంది. ఐరాస సమావేశంలో అమెరికా ప్రతిపాదించిన తీర్మానానికి ఫ్రాన్స్‌ తెచ్చిన మూడు కీలక సవరణలు ఆమోదం పొందాయి.
భద్రతా మండలిలోనూ…
సోమవారం మధ్యాహ్నం జరిగిన ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఉక్రెయిన్‌పై అమెరికా, ఈయూ మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. రష్యాను సమర్ధించేలా అమెరికా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా దానికి ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. తీర్మానాన్ని 10 దేశాలు సమర్ధించగా యూరోపియన్‌ కౌన్సిల్‌ దేశాలైన ఫ్రాన్స్‌, బ్రిటన్‌, గ్రీస్‌, స్లొవేనియా, డెన్మార్క్‌ గైర్హాజరు అయ్యాయి. దీంతో ఉక్రెయిన్‌పై భద్రతామండలి మొట్టమొదటిసారిగా తీర్మానాన్ని ఆమోదించింది. గతంలో రెండుసార్లు ఆ ప్రయత్నం జరిగినప్పటికీ రష్యా వీటో చేసింది.
విభేదాలకు బీజం
అట్లాంటిక్‌ ప్రాంతంలో విభేదాలకు ఈ నెల ప్రారంభంలోనే బీజం పడింది. ట్రంప్‌ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో చర్చించారు. యుద్ధాన్ని ఆపేందుకు చర్చలు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ పరిణామంపై యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. యూరోపియన్‌ నేతలను పట్టించుకోకుండా ట్రంప్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తారేమోనని అవి భావించాయి. అమెరికా రక్షణ మంత్రి హెగ్‌సేథ్‌, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ బ్రెజెల్స్‌, మ్యూనిచ్‌లో పర్యటన జరిపిన తర్వాత ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏదేమైనా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై పశ్చిమ దేశాల మధ్య నెలకొన్న విభేదాలు ఐరాస సర్వసభ్య సమావేశంలోనూ, భద్రతా మండలిలోనూ బయటపడ్డాయి. మండలిలో శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, రష్యాలు యూరోపియన్‌ యూనియన్‌ మద్దతిచ్చిన తీర్మానాన్ని వ్యతిరేకించాయి.
సర్వసభ్య సమావేశంలో చైనా ఓటింగుకు దూరంగా ఉండగా బ్రిటన్‌, ఫ్రాన్స్‌ ఆ తీర్మానానికి మద్దతు ఇచ్చాయి. హంగరీ మినహా మిగిలిన ఈయూ దేశాలన్నీ రెండు తీర్మానాలకూ అనుకూలంగా ఓటేశాయి. నాటో సభ్య దేశాల విషయానికి వస్తే అమెరికా, హంగరీ మాత్రమే ఈయూ కూటమితో విభేదించాయి. జీ-77లోని 134 దేశాల మధ్య కూడా ఏకాభిప్రాయం కన్పించలేదు. ఆసియా, ఆఫ్రికా దేశాల మధ్య ఈ విభేదాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. దక్షిణాసియా దేశాల్లో మిశ్రమ స్పందన కన్పించింది. భారత్‌, పాకిస్తాన్‌, శ్రీలంక దేశాలు రెండు తీర్మానాల ఓటింగుకూ దూరంగానే ఉన్నాయి. నేపాల్‌, మాల్దీవులు, భూటాన్‌ దేశాలు ఈయూ తీర్మానానికి అనుకూలంగా ఓటేయగా దానికి బంగ్లాదేశ్‌ దూరంగా ఉండిపోయింది. కానీ ఆ తర్వాత అమెరికా తీర్మానానికి చేసిన సవరణలకు మద్దతు ఇచ్చింది.

Spread the love