తల్లి మందలించిందని తనువు చాలించిన కూతురు

నవతెలంగాణ – తాడ్వాయి
తల్లి మందలించిందని మనస్తాపం చెందిన కూతురు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం గంగారం గ్రామపంచాయతీ పరిధిలోని భూపతిపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గంగారం గ్రామపంచాయతీ పరిధిలో గల భూపతిపురం గ్రామానికి చెందిన కొడెం మల్లయ్య – పద్మ ల ఏకైక కూతురు అంకిత(14) తాడ్వాయి మండల కేంద్రంలోని కస్తూరిబా గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నది. సెలవుల్లో ఇంటి వద్దనే ఉంది. ప్రతిరోజు సెల్ఫోన్ అతిగా చూడొద్దని తల్లి పద్మ మందలించింది. దీంతో మనస్థాపన చెందిన అంకిత ఉదయం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో చికిత్స నిమిత్తం అంకితను ములుగు ఏరియా హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Spread the love