– తెలుగమ్మాయి అరుంధతి రెడ్డికి చోటు
– ముక్కోణపు సిరీస్కు భారత జట్టు
ముంబయి : ధనాధన్ ఓపెనర్ షెఫాలీ వర్మకు మరోసారి నిరాశే ఎదురు కాగా.. తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకుంది. యువ ప్లేయర్లు కాశ్వీ గౌతమ్, శ్రీ చరణి, సుచి ఉపాధ్యారులు తొలిసారి భారత జట్టులో చోటు సాధించారు. శ్రీలంక వేదికగా జరుగనున్న ముక్కోణపు వన్డే సిరీస్కు భారత మహిళల జట్టును సీనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం ఎంపిక చేసింది. భారత్, శ్రీలంక, దక్షిణాఫ్రికా మహిళల జట్లు పోటీపడుతున్న ముక్కోణపు వన్డే సిరీస్ ఏప్రిల్ 27 నుంచి ఆరంభం కానుంది. డబుల్ రౌండ్ రాబిన్ పద్దతిలో సాగే టోర్నమెంట్లో లీగ్ దశలో ప్రతి జట్టు ఇతర జట్లతో రెండుసార్లు తలపడనుంది. టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్లో పోటీపడతాయి. ఏప్రిల్ 27న భారత్, శ్రీలంక తలపడనుండగా.. 29న భారత్, దక్షిణాఫ్రికా.. మే 4న శ్రీలంక, భారత్.. మే 7న భారత్, దక్షిణాఫ్రికా ఆడనున్నాయి. మే 11న ఫైనల్ జరుగుతుంది. ముక్కోణపు సిరీస్కు కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా నిలువనుంది.
షెఫాలీ వర్మను సీనియర్ సెలక్షన్ కమిటీ మరోసారి పక్కనపెట్టింది. జాతీయ జట్టులో అవకాశాలను షెఫాలీ సద్వినియోగం చేసుకోలేదు. కానీ ఇటీవల మహిళల ప్రీమియర్ లీగ్లో షెఫాలీ తొమ్మిది ఇన్నింగ్స్ల్లో 152.76 స్ట్రయిక్రేట్తో 304 పరుగులతో మెరిసింది. డబ్ల్యూపీఎల్లో గొప్పగా రాణించినా షెఫాలీకి జాతీయ జట్టులో చోటు దక్కలేదు. ఇటీవల జట్టుకు దూరమైన హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డి తిరిగి చోటు సాధించింది. 21 ఏండ్ల కాశ్వీ గౌతమ్ డబ్ల్యూపీఎల్లో 11 వికెట్లు పడగొట్టి సత్తా చాటింది. లెఫ్టార్మ్ స్పిన్నర్లు శ్రీ చరణి, సుచి ఉపాధ్యారులు సైతం డబ్ల్యూపీఎల్ మాయజాలంతో తొలిసారి జాతీయ జట్టులో నిలిచారు. హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్గా కొనసాగనుండగా.. స్మృతీ మంధాన వైస్ కెప్టెన్గా ఎంపికైంది. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్లో భారత్లో జరుగనున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ ముంగిట ఈ సిరీస్ టీమ్ ఇండియాకు కీలక కానుంది.
భారత మహిళల వన్డే జట్టు :
హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతీ మంధాన (వైస్ కెప్టెన్), ప్రతికా రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రొడ్రిగస్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యస్టికా భాటియా (వికెట్ కీపర్), దీప్తి శర్మ, ఆమన్జోత్ కౌర్, కాశ్వీ గౌతమ్, స్నేV్ా రానా, అరుంధతి రెడ్డి, తేజల్ , శ్రీ చరణి, సుచి.