నవతెలంగాణ – హైదరాబాద్: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్, టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సొంత గూటికి చేరిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో వచ్చే సీజన్కు ముంబై ఇండియన్స్ జట్టును చేరనున్నాడు. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ ఎవరన్నదానిపై సందిగ్ధత నెలకొంది. ఆ సందిగ్ధతకు గుజరాత్ టైటాన్స్ తెరదించింది. జట్టు కొత్త కెప్టెన్ను పరిచయం చేసింది. అందరూ ఊహించినట్టే భారత బ్యాటర్ శుభ్మన్ గిల్ ను నియమించింది. ఈ మేరకు సోమవారం ప్రకటించింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్గా తనను నియమించడం పట్ల గిల్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించడం గర్వంగా.. సంతోషంగా ఉంది. నాపై నమ్మకం ఉంచి ఇంత చక్కటి జట్టుకు నన్ను కెప్టెన్గా నియమించినందుకు ఫ్రాంచైజీకి ధన్యవాదాలు. మా అద్భుతమైన క్రికెట్ బ్రాండ్తో జట్టును నడిపించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అంటూ గిల్ చెప్పుకొచ్చాడు.