నవతెలంగాణ – హైదరాబాద్ : కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో కలిసి బెంగళూరులోని లోక్భవన్కు వెళ్లిన ఆయన, తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కార్యాలయంలో అందజేశారు. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో, ఆయన ప్రత్యేక కార్యదర్శికి రాజీనామా పత్రాన్ని సమర్పించినట్లు సిద్ధరామయ్య స్వయంగా వెల్లడించారు. అనంతరం డీకే శివకుమార్తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్ఠానం సూచనల మేరకే తాను రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సిద్ధరామయ్య కొంత భావోద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. 2006లో కాంగ్రెస్ పార్టీలో చేరానని, అప్పటి నుంచి పార్టీ తనను ఎంతో ఆదరించిందని గుర్తుచేసుకున్నారు. మంత్రిగా, రెండుసార్లు సీఎంగా, ప్రతిపక్ష నేతగా తనకు అనేక అవకాశాలు ఇచ్చిందని తెలిపారు. ఏడు కోట్ల కన్నడ ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కడం అదృష్టమన్నారు. తాను ముఖ్యమంత్రి అవుతానని కలలో కూడా అనుకోలేదని సిద్ధరామయ్య అన్నారు. తన కుటుంబంలో ఎవరికీ రాజకీయ నేపథ్యం లేదని, తాను గ్రామీణ జీవితం నుంచి వచ్చానని, పొరపాటున రాజకీయాల్లోకి అడుగుపెట్టానని వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ, ముఖ్యంగా తనకు సీఎం అయ్యే అవకాశం కల్పించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.



