నవతెలంగాణ-మద్నూర్
కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ ప్రక్రియలో జుక్కల్ నియోజకవర్గంలో ఏ ఒక్కరి ఓటూ గల్లంతు కాకుండా చూడాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, తహశీల్దార్ ఎండీ ముజీబ్ ను మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కోరారు. బుధవారం మద్నూర్ మండల పరిధిలోని గ్రామాలలో సర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సందర్భంగా హన్మంత్ షిండే మాట్లాడుతూ.. ఉపాధి నిమిత్తం ఊరి నుండి వెళ్ళి వేరే ప్రాంతాలలో పనిచేస్తున్న వారి ఓట్లు తొలగించొద్దని సూచించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ తప్పులు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు.
ఇందుకు బదులుగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఎండీ ముజీబ్ ప్రతిస్పందిస్తూ.. సర్ ప్రక్రియ పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలని బీఎల్ఓలకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని తెలిపారు. 2002 జనాభా లెక్కల ప్రకారం ఇంటింటికీ ఎన్యూమరేషన్ ఫారాలు అందిస్తున్నామని చెప్పారు. ఈ ఫారంతో ఏ ఒక్కరి ఓటు కూడా తొలగిపోదని స్పష్టం చేశారు. ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలని, డబుల్ ఓట్లు లేకుండా నివారించడమే దీని ముఖ్య ఉద్ధేశ్యమని చెప్పారు. ప్రజలు సర్వేకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బన్సీ పటేల్, కృష్ణ పటేల్, హనుమాన్లు, దేవిదాస్, విటల్, తదితరులు పాల్గొన్నారు.



