ఏపీలో సాంఘిక బహిష్కరణ అమానుషం

– తిరుమలాయపాలెం పెత్తందార్లపై కఠిన చర్యలు :వామపక్షాల డిమాండ్‌
అమరావతి : తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తిరుమలాయపాలెంలో దళితులపై పెత్తందారుల అరాచకాలను వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. తిరుమలాయపాలెం ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దళితులపై దాడికి పాల్పడిన పెత్తందారులను, వారికి కొమ్ము కాస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. తొలగించిన ప్రాంతంలోనే అంబేద్కర్‌ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని కోరాయి. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణతోపాటు వై సాంబశివరావు (సిపిఐ(యంఎల్‌) న్యూడెమొక్రసి), జాస్తి కిషోర్‌బాబు (సిపిఐ(యంఎల్‌)), కాటం నాగభూషణం (యంసిపిఐ(యు)), యన్‌ మూర్తి (సిపిఐ(యంఎల్‌) లిబరేషన్‌), చిట్టిపాటి వెంకటేశ్వర్లు (సిపిఐ(యంఎల్‌) న్యూడెమొక్రసి), బిఎస్‌ అమర్‌నాథ్‌ (యస్‌యుసిఐ(సి)), పివి సుందరరామరాజు (ఫార్వర్డ్‌ బ్లాక్‌), జానకి రాములు (రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ) ఆదివారం ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. తిరుమలాయపాలెంలోని ప్రభుత్వ స్థలంలో దళిత యువత అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే సహించలేని పెత్తందారులు విగ్రహాన్ని తొలగించడమే కాకుండా దళితులపై దాడులకు తెగబడ్డారని పేర్కొన్నారు. వారికి తిండి, నీరు, మందులు, కనీస అవసరాలు ఏవీ అందకుండా సాంఘిక బహిష్కరణ చేయడం అమానుషమని తెలిపారు. దళితులకు వస్తువులు ఏమైనా అమ్మితే జరిమానా విధిస్తామని దుకాణాలకు ఆదేశాలు జారీచేశారని పేర్కొన్నారు. నిత్యావసరాలు అందజేయడానికి వెళుతున్న దళిత సంఘాల కమిటీ వాహనాలను పోలీసులు అడ్డుకుని తిప్పి పంపడం సరైందికాదని పేర్కొన్నారు. చట్టప్రకారం శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు కూడా దళిత యువకులపై దాడి చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా దళిత భరోసా యాత్ర చేస్తుంటే దాన్ని కూడా సహించలేక పోలీసులు అడ్డుకుని విచక్షణారహితంగా అరెస్టులు చేశారన్నారు. పోలీసుల అండతోనే పెత్తందారులు అడ్డూఅదుపు లేకుండా దళితులను వేధిస్తున్నారన్నారని తెలిపారు. గ్రామ బహిష్కరణ వార్తలు వస్తున్నా ఇప్పటి వరకూ ఎస్‌సి కమిషన్‌ జోక్యం చేసుకోకపోవడం తగదన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కూడా సహించలేని స్థితిలో ఉండడమంటే రాష్ట్రంలో కులవివక్ష ఎంత తీవ్రంగా వుందో అర్థమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని దళితులపై దాడులు, సాంఘిక బహిష్కరణను విధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం దళితులకు అండగా నిలవాలని కోరారు.

Spread the love