నవతెలంగాణ – హైదరాబాద్: సైబరాబాద్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు కొత్త విధానాన్ని ఆవిష్కరించారు. ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ సమస్యలు అధిగమించేందుకు గతంలోనూ అనేక ప్రయత్నాలు చేశారు. మరోసారి కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సైబరాబాద్ పోలీసులు రెడీ అయ్యారు. ఏరియల్ సర్వే లైన్స్ ద్వారా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించనున్నారు. ఇందుకోసం అత్యాధునిక టెక్నాలజీని కలిగి ఉన్న అడ్వాన్స్డ్ డ్రోన్ కెమెరాలను ఉపయోగించనున్నారు. 100 మీటర్ల రేడియస్ లో నుండి డ్రోన్ కెమెరాను ఎగురవేసి ట్రాఫిక్ జంక్షన్ దగ్గర ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
కొత్త డ్రోన్ టెక్నాలజీ ….
హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం సైబరాబాద్ ఐటీ కారిడార్. ప్రతిరోజు ఇక్కడ ట్రాఫిక్ సమస్య సర్వసాధారణం. అందులోనూ రానున్న వర్షాకాలం సమయాల్లో ట్రాఫిక్ సమస్య మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు నిరంతరం ట్రాఫిక్ సమస్యల్లో ఇబ్బందులు పడుతుంటారు. వీటిని పరిష్కరించేందుకు సైబరాబాద్ పోలీసులు ఈ కొత్త డ్రోన్ టెక్నాలజీని వినియోగించనున్నారు. ఐటీ కారిడార్ లో రద్దీగా ఉండే జంక్షన్లను టార్గెట్ చేసుకొని 100 మీటర్స్ రేడియస్ పరిధిలో ఈ డ్రోన్ కెమెరాను ఎగరవేసి ఇవి చూపించే విజువల్స్ ఆధారంగా త్వరితగతిన సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టనున్నారు.
డ్రోన్ కెమెరా 3వ ఐ తో కంట్రోల్రూంకి సమాచారం….
ట్రాఫిక్ సమస్యతో పాటు రోడ్డు ప్రమాదాల ఘటన స్థలానికి త్వరితగతిన పోలీసులు చేరుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. డ్రోన్ కెమెరాల ద్వారా ఆక్సిడెంట్ అయిన ప్రాంతాన్ని నేరుగా పోలీసులు వీక్షించే విధంగా పరికరాన్ని క్రియేట్ చేశారు. ప్రమాదం జరిగిన చోటకు వెంటనే సంబంధిత పోలీసులను పంపించే దిశగా ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వమన్నారు. ఇక్కడ ట్రాఫిక్ కన్జేషన్గా మారిన వెంటనే వాటి సమాచారాన్ని కంట్రోల్ రూమ్కి చేరవేసే బాధ్యత ఈ డ్రోన్ కెమెరా 3వ ఐ లో ఉంటుంది.