నవతెలంగాణ – హైదరాబాద్ : వేసవి తాపంతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ ఒకేసారి చల్లని, వేడి కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందే దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని, మే నెలలో దేశవ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదవుతుందని శుభవార్త చెప్పింది. అదే సమయంలో, కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు, దేశవ్యాప్తంగా అధిక రాత్రి ఉష్ణోగ్రతలు తప్పవని హెచ్చరించింది. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర వెల్లడించిన వివరాల ప్రకారం, ఈసారి నైరుతి రుతుపవనాలు మే 14 నుంచి 16 మధ్య అండమాన్, నికోబార్ దీవులను తాకే అవకాశం ఉంది. మే నెలలో దేశ సగటు వర్షపాతం సాధారణం కంటే 110 శాతం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేశారు.
అయితే తూర్పు, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా నమోదయ్యే సూచనలున్నాయి. వర్షాల సూచన ఉన్నప్పటికీ, వేడి విషయంలో ఊరట అంతంతమాత్రంగానే ఉండనుంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నా, రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం అధికంగా ఉంటాయని ఐఎండీ తెలిపింది. “అధిక వర్షాల అంచనాతో మేఘాలు కమ్ముకుని ఉంటాయి. దీనివల్ల రాత్రిపూట వేడి బయటకు పోకుండా చిక్కుకుపోయి రాత్రులు వెచ్చగా ఉంటాయి” అని మహాపాత్ర వివరించారు.



