నవతెలంగాణ-మిడ్జిల్
మిడ్జిల్ మండలంలో జూలై 4న జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లు మరియు ఇతర కార్యక్రమాల సమన్వయంపై జిల్లా ఎస్పీ డి.జానకి, సభా స్థలాన్ని మండల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పర్యటన ప్రాంతంలో చేపట్టాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, వాహన పార్కింగ్, ప్రజల రాకపోకలు, అధికారుల సమన్వయం తదితర అంశాలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సజావుగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని, భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి జిల్లా అధికారి సంధ్య, జడ్చర్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ తహసిల్దార్ రాఘవేందర్ రెడ్డి, ఎస్సై శ్రీనివాసులు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



