ఎస్ఎల్సీ అధ్యక్షుడు షమ్మి సిల్వ రాజీనామా
కొలంబో (శ్రీలంక) : శ్రీలంక క్రికెట్ నాయకత్వ మార్పునకు సిద్ధమైంది. ఏడేండ్లుగా శ్రీలంక క్రికెట్ను నడిపిస్తున్న షమ్మి సిల్వపై క్రికెటర్లు, క్లబ్లు పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంక ప్రదర్శన సైతం పేలవం. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డును ప్రక్షాళన చేసేందుకు అక్కడి ప్రభుత్వం ముందుకొచ్చింది. దేశాధ్యక్షుడు అనుర కుమార జోక్యంతో క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ షమ్మి సిల్వ సహా ఎగ్జిక్యూటివ్ కమిటీ రాజీనామా చేసింది. ‘1973 స్పోర్ట్స్ చట్టంలోని సెక్షన్లు 31, 34 ప్రకారం సంక్రమించిన అధికారాలతో శ్రీలంక క్రికెట్ బోర్డు కార్యకలాపాలు తాత్కాలికంగా క్రీడలు, యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయని క్రీడా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీలంక క్రికెట్లో వ్యవస్థీకృ మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చేందుకు త్వరలోనే తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది మార్చి నుంచి శ్రీలంక క్రికెట్ బోర్డులో మార్పుల కోసం ప్రయత్నాలు జరుగుతుండగా.. తాజాగా దేశాధ్యక్షుడి జోక్యంతో క్రికెట్ బోర్డు నాయకత్వ ముఖచిత్రం మారిపోయింది. 2019లో అత్యధిక క్లబ్ల మద్దతుతో శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడిగా ఎన్నికైన సిల్వ.. 2021, 2023, 2025లో ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా ఐసీసీ చైర్మెన్గా వెళ్లటంతో.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగానూ సిల్వ కొంతకాలం పని చేశారు. మాజీ క్రికెటర్కు శ్రీలంక క్రికెట్ బోర్డు బాధ్యతలు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రభుత్వం చేతుల్లోకి శ్రీలంక క్రికెట్!
- Advertisement -
- Advertisement -



