క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌

Srikanth in the quarters– ట్రెసా, గాయత్రి జోడీ సైతం
– మకావు ఓపెన్‌ బ్యాడ్మింటన్‌
మకావు (చైనా): మకావు ఓపెన్‌ సూపర్‌ 300 టోర్నమెంట్‌లో భారత షట్లర్లు క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నారు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో కిదాంబి శ్రీకాంత్‌ వరుసగా రెండో విజయం నమోదు చేశాడు. మెన్స్‌ సింగిల్స్‌ రెండో రౌండ్లో సహచర భారత షట్లర్‌ ఆయుశ్‌ శెట్టిపై 21-13, 21-18తో వరుస గేముల్లో గెలుపొందాడు. మహిళల డబుల్స్‌లో ట్రెసా జాలి, పుల్లెల గాయత్రి జోడీ సైతం క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో 22-20, 21-11తో చైనీస్‌ తైపీ జోడీ లిన్‌ చున్‌, టెంగ్‌ చున్‌లపై వరుస గేముల్లో అలవోక విజయం సాధించింది. మహిళల సింగిల్స్‌లో తన్సీమ్‌ మిర్‌ 17-21, 21-13, 10-21తో మూడు గేముల మ్యాచ్‌లో జపాన్‌ షట్లర్‌ మియజాకి చేతిలో పోరాడి ఓటమి చెందింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కి రెడ్డి, సుమిత్‌ రెడ్డి జోడీకి నిరాశే ఎదురైంది. 17-21, 14-21తో మలేషియా షట్లర్లు వాంగ్‌, లిమ్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.

Spread the love