నవతెలంగాణ – హైదరాబాద్ : సినీ నటి పావలా శ్యామల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆమె, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స అనంతరం ఇంటికి వెళ్తున్న ఆమెను ఓ క్యాబ్ డ్రైవర్ నడిరోడ్డుపై వదిలివెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే… గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పావలా శ్యామల, ఇటీవల గుండె సంబంధిత చికిత్స కోసం కూకట్పల్లిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లారు. అయితే, ఆస్పత్రి సిబ్బంది చికిత్స చేయకుండా ఆమెను బయటకు పంపించింది.
దాంతో అర్ధరాత్రి సమయంలో ఇంటికి బయలుదేరగా, ఆమె ప్రయాణిస్తున్న క్యాబ్ డ్రైవర్ కూకట్పల్లి వై జంక్షన్ వద్ద ఫుట్పాత్పై వదిలి వెళ్లినట్లు సమాచారం. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెను అటుగా వెళ్తున్న కొందరు గమనించి, సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. వారు వెంటనే స్థానిక పోలీసులకు, ఆర్కే ఫౌండేషన్కు సమాచారం అందించారు. వారి సహాయంతో పావలా శ్యామలను సనత్నగర్లోని మరో ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.


