నవతెలంగాణ హైదరాబాద్: వేసవి ప్రత్యేక రద్దీ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి పశ్చిమ బెంగాల్లోని షాలిమార్, సాంత్రాగాఛిలకు.. కేరళలోని కొల్లంకు ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు బుధవారం వేర్వేరు ప్రకటనలను ఆ శాఖ విడుదల చేసింది. సికింద్రాబాద్-సాంత్రాగాఛి(07223) రైలు ప్రతి శుక్రవారం బయల్దేరుతుంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 28 వరకు 11 ట్రిప్పులు, అదేవిధంగా ప్రతి శనివారం తిరుగుప్రయాణమయ్యే సాంత్రాగాఛి-సికింద్రాబాద్(07224) ప్రత్యేక రైలు ఏప్రిల్ 20 నుంచి జూన్ 29 వరకు 11 ట్రిప్పులు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. గుంటూరు, విజయవాడ, దువ్వాడ, విజయనగరం, భువనేశ్వర్, కటక్, ఖరగ్పుర్ మీదుగా రాకపోకలు సాగించే ఈ రైలు రాష్ట్రంలో నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో ఆగుతుంది.
సికింద్రాబాద్-షాలిమార్(07225) ప్రత్యేక రైలు ఏప్రిల్ 15 నుంచి జూన్ 24 వరకు ప్రతి సోమవారం.. షాలిమార్-సికింద్రాబాద్(07226) రైలు ఏప్రిల్ 16 నుంచి జూన్ 25 వరకు ప్రతి మంగళవారం అందుబాటులో ఉండనున్న ఈ రైలు రాష్ట్రంలో కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం స్టేషన్లలో ఆగుతుంది. రాయనపాడు, రాజమహేంద్రవరం, దువ్వాడ, భువనేశ్వర్, ఖరగ్పుర్, సాంత్రాగాఛి మీదుగా రాకపోకలు సాగించే ఈ రైలు కూడా 11 ట్రిప్పులు తిరుగనుంది.
సికింద్రాబాద్-కొల్లం మధ్య రానుపోను 22 ట్రిప్పుల ప్రత్యేక రైళ్లను ద.మ. రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్-కొల్లం(07193) ప్రత్యేక రైలు ఏప్రిల్ 17, 24, మే 1, 8, 15, 22, 29 జూన్ 5, 12, 19, 26 తేదీల్లో బయల్దేరుతుంది. తిరుగుప్రయాణంలో కొల్లం-సికింద్రాబాద్(07194) రైలు ఏప్రిల్ 19, 26, మే 3, 10, 17, 24, 31, జూన్ 7, 14, 21, 28 తేదీల్లో అందుబాటులో ఉండనుంది. ఈ రైలు రాష్ట్రంలోని నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో ఆగుతుంది. గుంటూరు, ఒంగోలు, రేణిగుంట, కాట్పాడి, ఈరోడ్, కోయంబత్తూరు, ఎర్నాకుళం, కొట్టాయం, కాయంకుళం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుందని ద.మ. రైల్వే తెలిపింది.