తెలంగాణ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు

నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ సుజయ్‌పాల్‌, జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య నియమితులయ్యారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌, కలకత్తా హైకోర్టుల్లో సేవలందిస్తున్న వీరిని తెలంగాణకు బదిలీచేయాలని సుప్రీంకోర్టు కొలీజియం ఫిబ్రవరి 13న చేసిన సిఫార్సులను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. దీంతో కేంద్ర న్యాయశాఖ సోమవారం సంబంధిత ఉత్తర్వులను జారీచేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 222(1) కింద ఉన్న అధికారాలను అనుసరించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌తో సంప్రదించిన అనంతరం ఈ ఇద్దరు న్యాయమూర్తులను తెలంగాణ హైకోర్టుకు బదిలీచేసినట్టు న్యాయశాఖ పేర్కొంది.
తన కుమారుడు మధ్యప్రదేశ్‌ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్న నేపథ్యంలో తనను మరేదైనా హైకోర్టుకు బదిలీచేయాలని జస్టిస్‌ సుజయ్‌పాల్‌, వ్యక్తిగత కారణాల రీత్యా తనను కలకత్తా హైకోర్టు నుంచి బదిలీ చేయాలని జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య చేసుకున్న విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టు కొలీజియం వారిద్దర్నీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫార్సు చేసింది.

Spread the love