ఒకే ఏడాది ఐదుగురికి భారతరత్న

నవతెలంగాణ- హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ అవార్డుల పంట పండించింది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఏకంగా ఐదుగురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం  భారత రత్న ప్రకటించింది. ఇటీవ‌లే బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి క‌ర్పూరీ ఠాకూర్‌ల‌కు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌరపుర‌స్కారం ప్రక‌టించిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం మరో ముగ్గురికి ఈ పురస్కారాన్ని ప్రకటించింది. తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ న‌ర్సింహారావు, మ‌రో మాజీ ప్రధాని చౌద‌రి చ‌ర‌ణ్‌సింగ్‌, వ్యవ‌సాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథ‌న్‌కు కేంద్రం ‘భారత రత్న’ ప్రకటించింది. దీంతో ఈ ఏడాది ఏకంగా ఐదుగురికి అవార్డులు ప్రకటించినట్లైంది. దేశంలో అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’. ఏదైనా రంగంలో విశేష కృషి చేసిన పౌరుకుల కేంద్రం ఈ పురస్కారంతో సత్కరిస్తుంటుంది. ఇది జనవరి 2, 1954లో భారతదేశ మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఇప్పటివరకు నలభై మందికిపైగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వారిలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. భారతరత్న పొందిన పౌరులకు 7వ స్థాయి గౌరవం లభిస్తుంది. ఏటా ఈ పురస్కారాన్ని ముగ్గురికి మాత్రమే ప్రకటిస్తుంటారు. దేశ ప్రధానమంత్రి మాత్రమే రాష్ట్రపతికి ఏడాదికి గరిష్ఠంగా ముగ్గురిని ఈ పురస్కారానికి సిఫారసు చేయవచ్చు. కానీ, దీనికి పరిమితి మాత్రం లేదు. 1999లో ఈ పురస్కారాన్ని నలుగురు వ్యక్తులకు ప్రదానం చేశారు. అంతే అప్పటి నుంచి ఏడాదికి ముగ్గురికి మాత్రమే ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే, ఎన్నడూ లేని విధంగా ఈ ఏడు ఏకంగా ఐదుగురికి భారత రత్న వరించడం విశేషం. కాగా, ఈ ఏడాది భారతరత్న అవార్డులను ప్రకటించిన ఐదుగురిలో నలుగురికి మరణానంతరం అవార్డు వరించింది. ప్రస్తుతం అవార్డుకు ఎంపికైనవారిలో ఎల్‌కే అద్వానీ మాత్రమే జీవించి ఉన్నారు.

Spread the love