మహిళలకు ఆర్టీసీ మరో శుభవార్త

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో మహాలక్ష్మి స్కీంలో భాగంగా మహిళలకు చార్జీలు లేకుండా ఆర్టీసీలు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న విషయం తెలిసిందే. దీంతో బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా పండుగ సమయాల్లో మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వముందు ఓ ప్రతిపాదన చేసింది. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు మహిళలకు బస్సు చార్జీలు వసూలు చేస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జానార్ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం తాజాగా స్పందించినట్టు కాంగ్రెస్ వర్గాలు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశాయి. ఈ ప్రతిపాదనను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తిరస్కరించారని… మహిళల వద్ద ఎలాంటి చార్జీలు వసూలు చేయవద్దని చెప్పినట్టు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉచిత ప్రయాణ విధానం అమలు చేయాల్సిందే అని ఆర్టీసీకి తేల్చి చెప్పినట్టు తెలిసింది. మరోవైపు రాష్ట్ర మంత్రి సీతక్క కూడా స్పష్టం చేశారు. ఇటీవలే ఆమె మేడారం జాతరను సందర్శించారు. మేడారం జాతరకు వచ్చే మహిళలకు కూడా ఫ్రీ బస్సు సౌకర్యం కొనసాగుతుందని మీడియాతో చెప్పారు. మేడారం జాతరకు ఫిబ్రవరి 18 నుంచి 25 వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది.

Spread the love