– డిసెంబర్ 8లోగా కౌంటర్ దాఖలు చేయండి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడుకి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. బెయిల్ రద్దు పిటిషన్పై డిసెంబర్ 8లోగా రాత పూర్వకంగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిం చింది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17 ఏపై తీర్పు వచ్చిన తరువాత చంద్రబాబు బెయిల్ రద్దు కేసు వింటామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ సతీష్ చంద్రశర్మలతో కూడిన ధర్మా సనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ చంద్రబాబుకు హైకోర్టు విధించిన బెయిల్ షరతులను పొడిగించా లని కోర్టును కోరారు. అలాగే ”ఈ కేసు గురించి పబ్లిక్ డొమైన్లో ఎటువంటి ప్రకటన చేయకూడదు” అని అన్నారు. వెంటనే చంద్రబాబు తరఫు న్యాయ వాది సిద్దార్థ అగర్వాల్ జోక్యం చేసు కుని అత్యున్నత న్యాయస్థానం లో పెండింగ్లో ఉన్న అంశాలపై ఆ శాఖ అధికారులు ఇప్పటికీ బహి రంగ ప్రకటనలు చేస్తూనే ఉన్నారని తెలిపారు. ”స్కిల్ కేసుపై బహిరంగంగా మాట్లాడ కుండా ఉండటానికి మాకు అభ్యంతరం ఏమీ లేదు. కాని అదే షరతు రెండు వైపులా వర్తింపజేయాలి” అని పేర్కొన్నారు. దీనికి సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ”షరతు నిందితుడికి వర్తిస్తుంది.అది ప్రభుత్వానికి వర్తించదు” అని అన్నారు. విచారణ వాయిదా వేయ కుండా నోటీసలు జారీ చేయాలని రోహత్గీ కోరారు. ”ప్రతివాదికి నోటీసు జారీ చేయాలి. 40 పేజీల బెయిల్ ఆర్డర్లో మెరిట్పై నిర్ధారణలు ఉన్నాయి. నేను బెయిల్ ఆర్డర్లో కనుగొన్న వాటిని చూపిం చాలి. ఇది 300 కోట్ల ప్రజా నిధుల నుండి మళ్లించిన కేసు” అని రోహత్గీ, ధర్మాసనానికి తెలిపారు.
నోటీసు జారీ చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభ్యర్థనను కోర్టు అంగీకరించడమే కాకుండా, ఈ కేసు నుండి ఉత్పన్నమయ్యే సబ్ జ్యూడీస్ విషయాల గురించి పబ్లిక్ డొమైన్లో మాట్లాడకుండా చంద్ర బాబు నాయుడుకు బెయిల్ షరతును కొనసాగించా లని ఆదేశించింది. అయితే, రాజకీయ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడం, పాల్గొనడంపై నిషేధం విధించే ఇతర బెయిల్ షరతును విధించేందుకు ధర్మాసనం నిరాకరించింది.
ఈ షరతులను ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులో విధించింది. అయితే చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయబడినప్పుడు షరతును పొడిగించలేదు.సంక్షిప్త విచారణ ముగింపులో జస్టిస్ బేలా ఎం. త్రివేది ఇలా అన్నారు ”నోటీస్ జారీ చేస్తాం. డిసెంబరు 8న కౌంటర్ దాఖలు చేయాలి. నవంబర్ 3న హైకోర్టు విధించిన అన్ని షరతులు బహిరంగ ర్యాలీలు, సమావేశాలను నిర్వహించడం, పాల్గొనడం మినహా కొనసాగుతాయి. డిసెంబర్ 11న తదుపరి విచారణ జరుపుతాం” అని పేర్కొన్నారు.