ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్కు వైభవ్ తల్లిదండ్రులు
ముంబయి : 15 ఏండ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ..ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు అమ్మానాన్నలతో కలిసి వెళ్లనున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో అమోఘంగా రాణించిన వైభవ్ సూర్యవంశీ తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. సీనియర్ జట్టులో వైభవ్ సూర్యవంశీకి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అతడితో పాటు తల్లిదండ్రులు సైతం ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తారని, ఆ ఖర్చులను బోర్డు భరిస్తుందని బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా తెలిపారు. ‘జాతీయ జట్టులో 15 ఏండ్ల కుర్రాడిని చూడటం అరుదు. ఎన్నో దశాబ్దాల తర్వాత వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాడు జట్టులోకి వచ్చాడు. గతంలో సచిన్ టెండూల్కర్ ఈ వయసులో జట్టులో ఆడాడు. జట్టులో ఇతర క్రికెటర్లు, సహాయక సిబ్బంది అందరూ సీనియర్లే. సహజంగానే వైభవ్ సూర్యవంశీకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందుకే, అతడికి సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు వైభవ్ తల్లిదండ్రులను సైతం విదేశీ పర్యటనకు అనుమతించామని’ సైకియా వెల్లడించారు. ప్రస్తుతం ఏ జట్ల ముక్కోణపు వన్డే సిరీస్లో ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ.. శ్రీలంక-ఏతో మ్యాచ్లో వాగ్వివాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో బీసీసీఐ కల్పించుకోదని, ఏమైనా ఉంటే మ్యాచ్ రిఫరీ, అంపైర్లు చూసుకుంటారని సైకియా అన్నారు.
అమ్మా నాన్నసమేత సూర్యవంశీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



