టైటిల్‌ పోరుకు తరుణ్‌

టైటిల్‌ పోరుకు తరుణ్‌– ముగిసిన అన్మోల్‌, దేవికా పోరాటం
– కజకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌
అస్థానా (కజకిస్థాన్‌) : కజకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌లో భారత షటర్లు సత్తా చాటుతున్నారు. మెన్స్‌ సింగిల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ షట్లర్‌ తరుణ్‌ మన్నెపల్లి టైటిల్‌ పోరుకు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో 21-8, 21-7తో లి డుసి ఫట్‌ (వియత్నాం)పై తరుణ్‌ గెలుపొందాడు. మహిళల సింగిల్స్‌లో అనుపమ ఉపాధ్యాయ 24-22, 21-16తో జపాన్‌ షట్లర్‌ సొరనొ యోషికవాపై విజయంతో ఫైనల్లో ప్రవేశించింది. క్వార్టర్స్‌లో భారత యువ సంచలనం అన్మోల్‌ ఖర్బ్‌ను సొరనొ ఓడించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సంజరు శ్రీవాత్సవ, మనీషాల జోడీ 21-16, 10-21, 21-14తో కొసిల మమ్మేరి, తనైనాలను ఓడించి అంతిమ సమరానికి చేరుకుంది. అన్మోల్‌తో పాటు దేవికా పోరాటం సైతం క్వార్టర్స్‌లోనే ముగిసింది. హైదరాబాద్‌ షట్లర్‌ రుత్విక శివాని సైతం క్వార్టర్స్‌లో ఓటమిపాలైంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రుత్విక, రోహన్‌ క్వార్టర్స్‌లో 15-21, 15-21తో మలేషియా జోడీ చేతిలో నిరాశపరిచారు.

Spread the love