రేపు స్వదేశానికి తిరిగి రానున్న టీమిండియా..

నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ గెలిచిన భారత‌ జట్టు ‘హరికేన్ బెరిల్’ కార‌ణంగా బార్బడోస్‌లోనే చిక్కుకుపోయిన విష‌యం తెలిసిందే. అయితే, తాజా స‌మాచారం ప్ర‌కారం భార‌త జ‌ట్టు బుధ‌వారం స్వ‌దేశానికి తిరిగిరానున్నట్లు తెలిసింది. టీమిండియా ఆట‌గాళ్లు, సిబ్బంది కోసం బీసీసీఐ ఓ ప్ర‌త్యేక విమానం ఏర్పాటు చేసిన‌ట్లు అధికారిక వ‌ర్గాల స‌మాచారం. ఈరోజు సాయంత్రం 6 గంట‌ల‌కు అక్క‌డి నుంచి విమానం బ‌య‌లుదేరి, రేపు ఉద‌యం 7.45 గంట‌ల‌కు ఢిల్లీకి చేరుకోవ‌చ్చ‌ని తెలుస్తోంది. కాగా, ప్ర‌స్తుతం హ‌రికేన్ ప్రభావంతో అక్క‌డ క‌ర్ఫ్యూ విధించ‌గా ఎయిర్‌పోర్టును మూసివేశారు. అయితే బార్బడోస్ ప్రధాన మంత్రి మేడమ్ మియా మోట్లీ విమానాశ్రయాలు త్వ‌ర‌లో ప‌ని చేస్తాయ‌ని హామీ ఇచ్చారు. దాంతో భార‌త క్రికెట్ బోర్డు ఆట‌గాళ్ల‌ను త‌ర‌లించేందుకు ప్ర‌త్యేక విమానం ఏర్పాటు చేసింది.

Spread the love