నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ..

నవతెలంగాణ – హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేడు తెలంగాణ మంత్రి మండలి భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సందర్బంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలకు వడ్డీలేని రుణ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంలో అందుకు అవసరమైన నిధుల కేటాయింపు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పది మండలాలకు సాగు, తాగునీరు అందించేందుకు నిర్మించనున్న నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఆమోదం, మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటు ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆమోదించడం, రైతు భరోసా పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి అవసరమైన మార్పుచేర్పులు, వర్షాకాలం నుంచి పంటల బీమా అమలు వంటి అంశాలపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

Spread the love