తమిళనాడులో ఘోరం

తమిళనాడులో ఘోరం జరిగింది. విరుధునగర్‌ జిల్లాలోని ఒక బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ తీవ్రతతో పేలుడు చోటు చేసుకున్నది.. ఈ ఘటనలో– బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు
– 10 మంది మృతి
– పలువురికి గాయాలు
–  ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు
చెన్నై : తమిళనాడులో ఘోరం జరిగింది. విరుధునగర్‌ జిల్లాలోని ఒక బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ తీవ్రతతో పేలుడు చోటు చేసుకున్నది.. ఈ ఘటనలో దాదాపు పది మంది చనిపోయారు. అనేక మందికి గాయాలయ్యాయి. గాయాలపాలైనవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఫ్యాక్టరీలోని కెమికల్‌ మిక్సింగ్‌ రూమ్‌లో ఈ ప్రమాదం సంభవించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు.
ఫ్యాక్టరీలో పేలుడు తీవ్రత అధికంగా ఉన్నదనీ, దీని ధాటికి ఫ్యాక్టరీతో పాటు దగ్గరలోని నాలుగు బిల్డింగ్‌లు కూలిపోయా యని స్థానికులు చెప్పారు. విజరు అనే వ్యక్తికి చెందిన ఈ ఫ్యాక్టరీ నగరంలోని వెంబకొట్టరు ప్రాంతంలో ఉన్నది. భారీ పేలుడుతో మంటలు ఎగిసి పడ్డాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటన తర్వాత పోలీసులు, ఫైర్‌ విభాగం ప్రమాద స్థలానికి చేరుకున్నది. గాయాలపాలైనవారిని దగ్గరలోని ఆస్పత్రిలో చేర్పించారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందుతున్నారని అధికారులు చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారనీ, తీవ్ర గాయాలపాలైన ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలోనే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతున్నదని చెప్పారు.
తమిళనాడులోని బాణాసంచా ఫ్యాక్టరీల్లో పేలుళ్లు స్థానికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గతంలోనూ పలు ఫ్యాక్టరీల్లో ఇలాంటి పేలుళ్లే జరిగి ప్రాణ, ధన నష్టానికి దారి తీశాయి. గతేడాది రాష్ట్రంలోని క్రిష్ణగిరిలో గల ఒక ఫ్యాక్టరీలో పేలుడు జరిగి 8 మంది చనిపోయారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ఫ్యాక్టరీలో పేలుళ్లపై ఉన్నతాధికారులు దృష్టినిసారించాలనీ, ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.

Spread the love