భార్యను షికారు కోసం బీచ్‌కు తీసుకెళ్లి చంపేసిన భర్త

Suicidesనవతెలంగాణ – హైదరాబాద్
భార్యను సముద్రంలో ముంచి చంపేసి దానిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఓ లగ్జరీ హోటల్ మేనేజర్ ఇప్పుడు తీరిగ్గా కటకటాలు లెక్కపెట్టుకుంటున్నాడు. దక్షిణ గోవాలో జరిగిందీ ఘటన. నిందితుడు గౌరవ్ కటియార్ (29) తన భార్య దీక్షా గంగ్వార్ (27)ను కాబో డి రామా బీచ్‌కి తీసుకెళ్లి అక్కడామెను నీళ్లలో ముంచి చంపేశాడు. అయితే, ఈ ఘటనను వీడియో తీసిన ఓ వ్యక్తి దానిని బయటపెట్టడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం దీక్షా గంగ్వార్ మృతదేహాన్ని పోలీసులు బీచ్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. దీక్షతో వివాహేతర సంబంధం నెరిపిన కటియార్ ఏడాది క్రితం ఆమెను వివాహం చేసుకున్నాడు. శుక్రవారం షికారు కోసమని భార్యను తాను పనిచేస్తున్న హోటల్ సమీపంలోని బీచ్‌కు తీసుకెళ్లిన కటియార్ అక్కడామెను నీళ్లలో ముంచి చంపేశాడు. ఆ తర్వాత తన భార్య ప్రమాదవశాత్తు నీళ్లలో మునిగి చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, స్థానికుడు ఒకడు ఈ ఘటనను చిత్రీకరించడంతో అతడి నేరం వెలుగులోకి వచ్చింది. కటియార్, దీక్ష ఇద్దరిదీ లక్నో అని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love