– ఓటర్ స్లిప్పులు ప్రతి ఒక్కరికి అందేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు : జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లాలో ఉన్న పోలింగ్ కేంద్రాల పేర్లు, చిరునామాలు మరో సారి సరిచూసుకోవాలని, అభ్యంతరాలు ఉంటే వెంటనే సంబంధిత మండల తహసీల్దార్ కు తెలియజేయాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా అన్నారు. సోమవారం సమీకత కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో లో జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా పోలింగ్ కేంద్రాల పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లాలో ఉన్న పోలింగ్ కేంద్రాల పేర్లు, చిరునామాలను నిశితంగా పరిశీలించాలని, ఎక్కడైనా పొరపాట్లు ఉంటే వాటిని సరిచేసుకునేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కలిపించిం దని అన్నారు. భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న 8 మండలాలో 317 పోలింగ్ కేంద్రాల ఉన్నాయని, మంథని నియోజక వర్గంలో 5 మండలాలో 130 పోలింగ్ కేంద్రాల ఉన్నాయని , వీటిని అన్నీ రాజకీయ పార్టీలకు అందించామని, పోలింగ్ కేంద్రాల పేర్లు సవరిం చాల్సిన అవసరం ఉంటే వెంటనే సంబంధిత మండల తహసీల్దార్ కు సమాచారం అందించాలని అన్నారు. పోలింగ్ నాడు ఓటరు సరైన పోలింగ్ కేంద్రానికి చేరుకునే విధంగా సహకారం అందించేందుకు ఓటర్ స్లిప్పుల పంపిణీ పకడ్బందిగా జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, నియోజకవర్గం లోని ఆయా మండలాల తహసిల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.