– నోటీసులు అందుకున్న ఓటర్లతో కార్యాలయానికి క్యూ
నవతెలంగాణ – అశ్వారావుపేట : ఎస్ఐఆర్ ప్రక్రియ కార్యాచరణలోకి రావడంతో ఎనామలీస్ ఓటర్లు గురువారం తహశీల్దార్ కార్యాలయానికి పెద్దఎత్తున తరలివచ్చారు. నోటీసులు అందుకున్న ఓటర్లతో కార్యాలయం కిక్కిరిసిపోయింది. మండలంలోని 51 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 47,382 మంది ఓటర్లు ఉండగా, ఎస్ఐఆర్ పరిశీలనలో 41,120 మంది ఓటర్ల వివరాలను డిజిటైజ్ చేశారు. మరో 6,262 మంది ఓటర్లను అన్కలెక్టిబుల్గా నమోదు చేశారు. వీరిలో శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు 3,575 మంది, మృతులుగా నమోదైన వారు 1,891 మంది, డబుల్ ఓటర్లుగా గుర్తించిన వారు 498 మంది ఉన్నారు.
ఇవికాక నో మ్యాపింగ్ కింద 7361 మంది, అబ్సెంట్గా 692 మంది, ఇతర కేటగిరీలో 102 మంది ఓటర్లు నమోదయ్యారు. మొత్తం 6,262 మంది ఓటర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
అయితే ఓటు హక్కుకు అర్హత ఉండి ఎస్ఐఆర్లో ఓటు తొలగింపునకు గురైన వారు ఎన్నికల సంఘం ఆమోదించిన ఏదైనా ఒక ఆధారాన్ని సమర్పించి, సహాయ ఎన్నికల అధికారి (తహశీల్దార్) సమక్షంలో సెల్ఫీ ఫొటోతో తమ వివరాలను తిరిగి డిజిటైజ్ చేయించుకోవాల్సి ఉంటుంది.
దీంతో ఓటు హక్కుకు అర్హత ఉన్నప్పటికీ తమ ఓటు తొలగింపునకు గురైన పలువురు ఓటర్లు గురువారం తహశీల్దార్ కార్యాలయానికి పెద్దఎత్తున చేరుకున్నారు. దీంతో కార్యాలయం సందడిగా మారింది.
నందిపాడులో పెద్ద సంఖ్యలో ఓట్లు రద్దైన విషయంపై సీపీఐ(ఎం) జిల్లా నాయకుడు బుడితి చిరంజీవి తహశీల్దార్ దాసరి కిశోర్, ఎన్నికల విభాగం డిప్యూటీ తహశీల్దార్ హుస్సేన్తో చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ అర్హత ఉన్న ఓటర్లు ఎన్నికల సంఘం ఆమోదించిన ఆధారం సమర్పిస్తే వారి ఓటు హక్కును తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.



